ఐపీఎస్‌పై ‘నిఘా’ దాడులు

14 Oct, 2015 04:06 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్  ములాయంతో ఘర్షణకు దిగిన ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ ఇంటిపై అక్రమాస్తుల కేసులో విజిలెన్స్ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇంటి బయట విజిలెన్స్ సిబ్బంది ఠాకూర్‌తో గొడవపడి, ఆయన చేతిలోని పత్రాలు లాక్కున్నారు. వాటినివ్వాలని  ఠాకూర్ చెప్పినా తిరస్కరించారు. ‘ములాయంపై ఎఫ్‌ఐఆర్ దాఖలుచేయడంతో నన్ను వేధిస్తున్నారు.

విజిలెన్స్ డెరైక్టర్ భానుప్రతాప్  సమాజ్‌వాదీ కార్యకర్తలా వ్యవహరిస్తుండటంతో విజిలెన్స్ బృందం నా ఇంటిపై దాడి చేసింది’ అని ఠాకూర్ ఆరోపించారు. తాను చెప్పినట్లు వినాలంటూ ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడుతున్నారని ములాయంపై ఠాకూర్  కేసు పెట్టడంతో  ఆయనను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత  ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది.

>
మరిన్ని వార్తలు