నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లిన ‘బాహుబలి’

5 Jun, 2017 17:55 IST|Sakshi
నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లిన ‘బాహుబలి’

- అత్యంత బరువైన జీఎస్ఎల్‌వీ-మార్క్‌3 డి1 ప్రయోగం సక్సెస్‌
- రోదసీలోకి జీశాట్‌-19 ఉపగ్రహాన్ని పంపిన ఇస్రో


శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) బాహుబలిగా అభివర్ణిస్తున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3డీ1 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 640 టన్నుల జీఎ్‌సఎల్‌వీ-మార్క్‌3 డి1 వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది.  శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోగల సతీష్‌ ధావన అంతరిక్ష పరిశోధన కేంద్రం(షార్‌) నుంచి సోమవారం సాయంత్రం 5:28 గంటలకు ఈ ప్రయోగం జరిగింది.

దీనిద్వారా 3,136 కిలోల భారీ ఉపగ్రహం జీశాట్‌-19ని రోదసీలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ,136 కిలోల బరువైన జీశాట్‌–19 సమాచార ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా(పెరిజీ) 170 కి.మీ. భూమికి దూరంగా(అపోజి) 35,975 కి.మీ. ఎత్తులోని జియో ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌(భూ బదిలీ కక్ష్య)లో ప్రవేశపెట్టారు.

ప్రయోగమిలా.. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3డీ1  పొడవు 43.43 మీటర్లు.  బరువు  640 టన్నులు. మొత్తం మూడు దశల్లో ఈ ప్రయోగాన్ని 16.20 నిమిషాల్లో పూర్తి చేసేందుకు శాస్త్రవేత్తలు సంకల్పించారు. కౌంట్‌డౌన్‌ ముగిసిన వెంటనే మొదటిదశలో రెండు వైపులున్న 200 టన్నుల ఘన ఇంధన బూస్టర్ల(ఎస్‌–200)ను మండించటంతో రాకెట్‌ ప్రయాణం ప్రారంభమైంది. తర్వాత 1.54 నిమిషాలకు రెండో దశలోని 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని (ఎల్‌–110) మండించి రాకెట్‌ ప్రయాణ స్పీడ్‌ను పెంచుతారు. 2.20 నిమిషాలకు ఎస్‌–200 రెండు బూస్టర్లు విడిపోయి మొదటిదశను పూర్తి చేస్తాయి. 5.20 నిమిషాలకు రెండో దశ పూర్తయింది.

25 టన్నుల క్రయోజనిక్‌ ఇంధనంతో మూడోదశను ప్రారంభించి 16.20 నిమిషాలకు రాకెట్‌కు శిఖర భాగంలో అమర్చిన 3,136 కిలోల బరువైన జీశాట్‌–19 సమాచార ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా(పెరిజీ) 170 కి.మీ. భూమికి దూరంగా(అపోజి) 35,975 కి.మీ. ఎత్తులోని జియో ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌(భూ బదిలీ కక్ష్య)లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత బెంగళూరు హసన్‌లోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం ఉపగ్రహాన్ని అదుపులోకి తీసుకుని.. ఉపగ్రహంలో నింపిన అపోజీ మోటార్లను మండించి భూమికి 36 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ఉపగ్రహాన్ని స్థిరపరుస్తారు.

17 ఏళ్లనాటి కల సాకారం
భారత అంతరిక్ష సంస్థ.. ఇస్రో నమ్మినబంటు పీఎ్‌సఎల్‌వీ వాహకనౌక 1,850 కిలోల బరువున్న ఉపగ్రహాలను దిగ్విజయంగా రోదసిలోకి చేరవేస్తోంది. జీఎ్‌సఎల్‌వీ రాకెట్‌ 2,200 కిలోల బరువు కలిగిన ఉపగ్రహాలతో అంతరిక్షంలోకి దూసుకుపోతుంది. అంతకంటే బరువైన ఉపగ్రహాలను ప్రయోగించాలంటే మనదేశం విదేశాలను ఆశ్రయించాల్సి వచ్చేది. ఈ పరిస్థితిలో మార్పువచ్చేలా నాలుగు టన్నుల బరువున్న భారీ ఉపగ్రహాలనూ రోదసిలోకి చేరవేసేందుకు ఓ వాహకనౌకను రూపొందించుకోవాలని ఇస్రో సంకల్పించింది.

జీశాట్‌–19తో ఉపయోగాలివీ..
జీశాట్‌–19 సమాచార ఉపగ్రహం బరువు 3,136 కిలోలు. ఇది దేశంలో టెలివిజన్‌ ప్రసారాలు, టెలికం రంగంలో విస్తృతసేవలు, ఇంటర్నెట్‌ వేగవంతంగా పనిచేయడమేగాక అధునాతనమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థ అందుబాటులోకి తెస్తుంది.  ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌లో ఇంటర్నెట్‌ను వేగవంతం చేయడానికి ఎంతో ఉపకరిస్తుంది.  ఉపగ్రహంలో  కేయూ బాండ్‌ హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌పాండర్స్‌తోపాటు జియో స్టేషనరీ రేడియేషన్‌ స్పెక్ట్రోమీటర్‌ పేలోడ్స్‌ను అమర్చి పంపుతున్నారు. 3,136 కిలోల ఉపగ్రహంలో 1,742 కిలోల ఇంధనం నింపారు. పేలోడ్స్‌ బరువు 1,394 కిలోలు.   జీశాట్‌–9 ఉపగ్రహం పదేళ్లపాటు సేవలు అందిస్తుంది.

మరిన్ని వార్తలు