అరుణ్ జైట్లీ నిర్బంధం అప్రజాస్వామికం: మోడీ

11 Aug, 2013 12:11 IST|Sakshi
అరుణ్ జైట్లీ నిర్బంధం అప్రజాస్వామికం: మోడీ

జమ్మూ విమానాశ్రయంలో బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ బృందాన్ని పోలీసులు నిర్బంధించిన ఘటనను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఆదివారం తీవ్రంగా ఖండించారు. ఆ ఘటన అప్రజాస్వామికమని ఆయన వ్యాఖ్యానించారు. కిష్టవార్ జిల్లాలో జరిగిన మతఘర్షణలకు గల కారణాలు అన్వేషించేందుకు వెళ్లిన అరుణ్ జైట్లీ బృందాన్ని అలా అడ్డుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు.

కిష్టవార్ జిల్లాలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు బయట సమాజానికి తెలిపే క్రమంలో వారు జమ్మూ వెళ్లారని  మోడీ వివరించారు. అయితే అక్కడ జరిగిన నిజాలు వెలుగులోకి రాకుండా ప్రతిపక్షాలను ప్రభుత్వం ఇలా అడ్డుకుంటుందని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. అందులోభాగంగానే జైట్లీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారని మోడీ తెలిపారు.

కిష్టవార్ జిల్లాలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు బీజేపీ సీనియర్ నేత అరుణ్జైట్లీ నేతృత్వంలోని బృందం ఆదివారం జమ్మూ విమానాశ్రయాకి చేరుకుంది.  అరుణ్జైట్లీ బృందాన్ని పోలీసులు నిర్భంధించారు. మతకలహాలు చోటుచేసుకున్న కిష్టావర్ ప్రాంతానికి వెళ్లకుండా ఆ బృందంపై ఆంక్షలు విధించారు. జమ్మూ నుంచి వెంటనే న్యూఢిల్లీ వెళ్లిపోవాలని ఆ బృందాన్ని కోరినట్లు ఉన్నతాధికారి వెల్లడించారు.

ఈద్ పండగ సందర్భంగా గత రెండు రోజుల క్రితం కిష్టవార్ జిల్లాలో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు.వారు జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ ఘర్షణలకు గల కారణాలు, స్థానికంగా నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు బీజేపీ నేత అరుణ్ జైట్లీ నేతృత్వంలోని ఓ బృందం న్యూఢిల్లీ నుంచి ఆదివారం ఉదయం జమ్మూకు బయలుదేరి వెళ్లింది. ఆ క్రమంలో ఆ బృందాన్ని జమ్మూ విమానాశ్రయంలో పోలీసులు నిర్బంధించారు.

మరిన్ని వార్తలు