'జనతా గ్యారేజ్‌' మరో భారీ రికార్డు!

20 Sep, 2016 09:08 IST|Sakshi
'జనతా గ్యారేజ్‌' మరో భారీ రికార్డు!

జూనియర్‌ ఎన్టీఆర్‌ తాజా సినిమా 'జనతా గ్యారేజ్‌' కలెక్షన్ల విషయంలో ఇప్పటికీ జోరు ప్రదర్శిస్తున్నది. తెలుగు సినీ చలనచిత్ర చరిత్రలో మూడో అతిపెద్ద హిట్‌ చిత్రంగా నిలిచిన ఈ సినిమా మూడోవారంలో నిలకడగా వసూళ్లు రాబడుతున్నది. మూడోవారానికి ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.106 కోట్లు రాబట్టినట్టు సమాచారం. ఇందులో రూ. 81.4 కోట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచే వచ్చాయని తెలుస్తోంది. ఇక ఒక్క కర్ణాటకలో రూ.16 కోట్లు వసూలుకాగా, కేరళలో రూ. 4 కోట్లు రాబట్టింది. 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా రూ. 120 కోట్లు వసూలు చేసిన ’జనతా గ్యారేజ్‌’... బాహుబలి, శ్రీమంతుడు సినిమాల తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. దీంతో పవన్‌ కల్యాణ్‌ ’అత్తారింటికి దారేది’ సినిమా వసూళ్లను ’జనతా’ దాటేసిందని బాక్సాఫీస్‌ టాక్‌ ను బట్టి తెలుస్తోంది.

ఇక అమెరికాలోనూ ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. మూడువారంలో అమెరికాలో ’జనతా గ్యారేజ్‌’ వసూళ్లు బాగున్నాయని, మొత్తంగా అగ్రరాజ్యంలో ఈ సినిమా 17,77,542 డాలర్లు (రూ. 11.92 కోట్లు) సాధించిందని బాలీవుడ్‌ ట్రేడ్‌ విశ్లేషకుడు తరన్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. మొత్తంగా ఈ సినిమా అమెరికాలో రెండు మిలియన్‌ డాలర్ల మార్క్‌ రాబట్టే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

ప్రకృతి ప్రేమికుడిగా సరికొత్త పాత్రలో తారక్‌ విభిన్నంగా కనిపించిన ’జనతా గ్యారేజ్‌’.. మోహన్‌ లాల్‌, సమంత, నిత్యమీనన్‌ వంటి భారీ తారాగణంతో రూపొందింది. ఈ సినిమాకు మొదట డివైడ్‌ టాక్‌ వచ్చినా.. ఎన్టీఆర్‌, మోహన్‌లాల్‌ నటన ప్లస్‌ అయింది. ప్రకృతి ప్రేమికుడిగా ఎన్టీఆర్‌ చూపిన అభినయానికి ప్రశంసలు దక్కుతున్నాయి.

మరిన్ని వార్తలు