జార్ఖండ్‌లో కూలిన బొగ్గు గని

31 Dec, 2016 02:10 IST|Sakshi
జార్ఖండ్‌లో కూలిన బొగ్గు గని

11 మంది మృతి

జార్ఖండ్‌: జార్ఖండ్‌లోని గోదా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. లాల్మాటియా ప్రాంతంలోని ఈస్ట్రన్‌  కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (ఈసీఎల్‌) బొగ్గుగనిలో గురువారం రాత్రి పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంతో 11 మంది మరణిం చారు. 60 మందికిపైగా కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు.  ధన్‌బాద్, పట్నాల నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించాయి. గనుల్లో ఉన్న శిథిలాలను తొలగిస్తున్నాయి. క్షతగాత్రుల ను ఉర్జానగర్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గని లోపల ఎంత మంది చిక్కుకున్నారు అనే దానిపై స్పష్టత రాలేదని కేంద్ర విద్యుత్, బొగ్గుగనుల మంత్రి పియూష్‌ గోయల్‌ తెలిపారు.ప్రమాద సమయంలో దాదాపు 10–12 యంత్రాలు గనిలో పనిచేస్తున్నాయని ఎస్పీ హిరాలాల్‌ చౌహాన్‌ తెలిపారు.

ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సానుభూతిని తెలియ జేశారు. తాను జార్ఖండ్‌ సీఎం రఘువర్‌ దాస్‌తో మాట్లాడినట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. పరిస్థితి చక్కదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు గోయల్‌ కృషి చేస్తున్నారన్నారు.  మృతుల కుటుం బాల కు రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ.25 వేల చొప్పున పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున పరిహారాన్ని  ఈసీఎల్‌ ప్రకటించింది.