అక్కడ ‘కబాలి’ క్లైమాక్స్‌ మారింది!

24 Jul, 2016 13:32 IST|Sakshi

విడుదలకు ముందు ‘కబాలి’ సినిమా క్లైమాక్స్‌పై అనేక కథనాలు వచ్చాయి. ‘కబాలి’ సినిమాలో నెగిటివ్ ఎండింగ్ ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో క్లైమాక్స్‌లో ‘కబాలి’ చనిపోతాడా? అని రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ నిజానికి దర్శకుడు పా రంజిత్ క్లైమాక్స్‌ విషయంలో సాహసం చేయలేకపోయాడు. చివరి సీన్‌లో తుపాకీ పేలుడు శబ్దం వినిపించినా.. ఈ తూటాకి ‘కబాలి’ చనిపోయాడా? అన్న విషయాన్ని మాత్రం దర్శకుడు చూపించలేదు.

కథ, కథనం విషయంలో తనదైన స్టైల్‌ను ఫాలో అయిన పా రంజిత్ క్లైమాక్స్‌ విషయంలో మాత్రం సాహసించలేకపోయాడు. రజనీ పాత్ర తెరపై చనిపోయినట్టు చూపించడం అంత ఈజీ కాదు. దీనిని అభిమానులు జీర్ణించుకోలేరు. అందుకే తుపాకీ శబ్దంతో, కొంత సస్పెన్స్‌తో ‘కబాలి’  క్లైమాక్స్‌ను ముగించాడు. దీంతో సినిమా నెటిగివ్ ఎండింగా.. పాజిటివ్ ఎండింగా అనేది ప్రేక్షకుడికి అంతుచిక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా క్లైమాక్స్‌ గురించి మరో ట్విస్టు వెలుగుచూసింది.

సినిమా అంతా మలేషియా నేపథ్యంగా, అక్కడ జరిగే గ్యాంగ్‌వార్ ప్రధాన కథగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మలేషియాలో ఈ సినిమా క్లైమాక్స్‌ను మార్చారు. క్లైమాక్స్‌లో ‘కబాలి’  పోలీసులకు లొంగిపోతాడని పేర్కొన్నారు. మలేషియా నేపథ్యంగా సినిమా తెరకెక్కడం, ఎక్కువశాతం షూటింగ్ అక్కడే జరిగిన నేపథ్యంలో స్థానికంగా వ్యతిరేకత రాకుండా..  చట్టాన్ని గౌరవించి ‘కబాలి’ పోలీసులకు లొంగిపోయినట్టు పేర్కొన్నారని భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు