టాప్‌ డైరెక్టర్‌ దిష్టిబొమ్మ దహనం!

19 Mar, 2017 14:09 IST|Sakshi
టాప్‌ డైరెక్టర్‌ దిష్టిబొమ్మ దహనం!

ముంబై: బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీకి కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం 'పద్మావతి' విషయంలో ఆందోళనలు తగ్గుముఖం పట్టడం లేదు. ఇప్పటికే ఆందోళనకారులు జైపూర్‌లో 'పద్మావతి' షూటింగ్‌పై దాడి చేసి.. దర్శకుడిని కొట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మహారాష్ట్ర కొల్హాపూర్‌లో 'పద్మావతి' చిత్రం కోసం భారీస్థాయిలో వేసిన సెట్టింగ్స్‌ను తగలబెట్టారు.

జైపూర్‌లో భన్సాలీపై దాడి చేసిన రాజ్‌పుత్‌లకు చెందిన కర్ణిసేన తాజాగా శనివారం రాత్రి ముంబై సమీపంలోని నల్లసోపరా వద్ద ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా కర్ణిసేన కార్యకర్తలు దర్శకుడు భన్సాలీ దిష్టిబొమ్మను తగలబెట్టారు. దర్శకుడికి, పద్మావతి చిత్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్‌పుత్‌ రాకుమారి అయిన 'పద్మావతి' జీవితకథను వక్రీకరించి సినిమాగా తెరకెక్కిస్తున్నారని ఆరోపిస్తూ కర్ణిసేన భన్సాలీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.