ఆమె నా కార్యక్రమాన్ని అడ్డుకున్నారు: సీఎం

9 Jul, 2016 13:55 IST|Sakshi
ఆమె నా కార్యక్రమాన్ని అడ్డుకున్నారు: సీఎం

అహ్మదాబాద్: కేంద్ర ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేసే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. బీజేపీ పాలితరాష్ట్రం గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్పై విమర్శలు ఎక్కుపెట్టారు. గుజరాత్లోని సూరత్లో జరగాల్సిన తన కార్యక్రమాన్ని ఆనందీబెన్ అడ్డుకున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికీ తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉందన్నారు.

శనివారం ఉదయం కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులు, ఆప్ నేతలతో కలసి గుజరాత్లోని రాజ్కోట్కు వెళ్లారు. సోమ్నాథ్లోని ప్రసిద్ధ శివాలయాన్ని దర్శించారు. ఆ తర్వాత 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రెండురోజుల పర్యటనకు గుజరాత్కు వచ్చానని, ఆదివారం సూరత్ వెళ్లాల్సివుందని కేజ్రీవాల్ చెప్పారు. అయితే ముఖ్యమంత్రి ఆనందీబెన్ సూరత్లోని వ్యాపారవేత్తలు, ప్రజలపై ఒత్తిడి చేసి తమ పార్టీ కార్యక్రమాన్ని రద్దు చేయించారని ఆరోపించారు. కాగా సూరత్ పర్యటనకు రావాలని కేజ్రీవాల్కు పంపిన ఆహ్వానాన్ని ఓ వర్తక సంఘం విరమించుకోగా, దీనివెనుక బీజేపీ ప్రభుత్వం హస్తముందని ఆప్ నేతలు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు