తిరువనంతపురం: కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల నుంచి ఆందోళనలు చేపట్టనున్నట్టు రాష్ట్ర బీజేపీ శాఖ ప్రకటించింది. జూలై 3న గవర్నర్ అధికార నివాసం ఎదుట నిరసన ప్రదర్శన చేపడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వి. మురళీధరన్ తెలిపారు.
కామన్వెల్త్ క్రీడల కుంభకోణంలో షీలా దీక్షిత్ పాత్ర ఉందని లోకాయుక్త చెప్పిన అంశాన్ని ఆందోళనలో లేవనెత్తుతామని చెప్పారు. తనంత తానుగా షీలా తన పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే జూలై 7 వరకు తమ ఆందోళన కొనసాగుతుందని మురళీధరన్ తెలిపారు. 14 జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేస్తామని చెప్పారు.