దేశంలోనే అరుదైన రైలు.. లెర్నింగ్‌ ఎక్స్‌ప్రెస్‌

6 Jun, 2017 17:41 IST|Sakshi


కాసర్‌గోడ్‌:
వేసవి సెలవుల అనంతరం తిరిగొచ్చిన విద్యార్థులు.. ‘లెర్నింగ్‌ ఎక్స్‌ప్రెస్‌’ను చూసి కేరింతలుకొట్టారు. రైలు బండి ఎక్కినట్లు క్లాస్‌రూమ్‌లోకి వెళ్లడం, ఇంజిన్‌లో కూర్చొని హారన్‌ మోగించడం(అల్లరి చేయడం) లాంటి కొత్త అనుభూతులు వారిని మరింత ఉత్సాహపర్చాయి.

సోమవారం స్కూల్‌ రీఓపెన్‌ చేయగానే అక్కడ కనిపించిన దృశ్యాలు, విద్యార్థుల సందడి ఊరంతా పాకింది. తమ పిల్లల్ని రైల్‌ స్కూల్లోనే చేర్పించడానికి తల్లిదండ్రులు ఎగబడ్డారు. ఫలితంగా అడ్మిషన్లు వరదలా వచ్చాయి. పిల్నల్ని ప్రభుత్వ పాఠశాలల వైపునకు మళ్లించడానికి కారణమైన వినూత్న ఆలోచనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. విద్యార్థుల కోసం ఈ తరహా ‘లెర్నింగ్‌ ఎక్స్‌ప్రెస్‌’ను ఏర్పాటుచేయడం ఇదే తొలిసారి.

ఇంతకీ ఎక్కడుందీ స్కూల్‌? కేరళలోని కాసర్‌గోడ్‌ జిల్లా పిలికోడ్‌ గ్రామంలోని ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల ఇంది. ఏడు, ఆరు తరగతులు మినహాయించి నర్సరీ నుంచి ఐదో తరగతుల వరకు ఆయా క్లాస్‌ రూమ్‌ల బయట, లోపల అందమైన రంగులువేశారు. దాదాపు 400 మంది పిల్లలు చదువుతోన్న ఈ పాఠశాలకు ఈ ఏడాది ఏకంగా 185 కొత్త అడ్మిషన్లు వచ్చాయి.

ఖర్చు ఎవరిది? స్కూల్‌ ఆవరణను అందంగా పెయింట్‌ చేసినందుకుగానూ దాదాపు రూ.2 లక్షలు ఖర్చయింది. స్కూళ్ల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధులకుతోడు పిలికోడ్‌ గ్రామస్తులు కొందరు నిధులు సమీకరించారు. సంజీష్‌ వెంగర అనే పెయింటర్‌ నెల రోజులు శ్రమించి స్కూల్‌కు కొత్తరూపం ఇచ్చాడిలా..








మరిన్ని వార్తలు