అవినీతిపరులు, మోసకారులకే చోటు!

3 Mar, 2014 04:23 IST|Sakshi

లఖీంపూర్ (యూపీ): ఎన్నికల్లో అన్ని పార్టీల నేతలు తమను తాము నిజాయతీపరులుగా, నికార్సైన వ్యక్తులుగా ప్రచారం చేసుకుంటుంటే ఓ పార్టీ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ప్రజల్లో ప్రచారం చేసుకుంటోంది. కేవలం అవినీతిపరులు, మోసకారులకే తమ పార్టీలో చోటిస్తామని పేర్కొంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌కు చెందిన నరేశ్‌సింగ్ భదౌరియా (52) అనే వ్యక్తి ఖాస్ ఆద్మీ పార్టీ (ఖాప్) పేరిట ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలో అభ్యర్థులను నిలపనున్నాడు.

 

ఇందుకోసం ప్రచారంలో భాగంగా శనివారం చేపట్టిన ర్యాలీలో అతను ప్రదర్శించిన బ్యానర్ చూపరులను అవాక్కయ్యేలా చేసింది. ‘‘కేవలం అవినీతిపరులు, కుట్రదారులు, మోసకారులు తదితరులే పార్టీ సభ్యత్వానికి అర్హులు. ఆమ్ ఆద్మీ పార్టీ మినహా మరే ఇతర పార్టీతోనైనా పొత్తుకు మేం సిద్ధమే’’ అంటూ బ్యానర్‌లో పొందుపరిచారు.
 

మరిన్ని వార్తలు