కృష్ణా జలాల వివాదంపై నేడు మళ్లీ సమావేశం

26 Aug, 2013 08:23 IST|Sakshi

న్యూఢిల్లీ : కృష్ణా జలాల వినియోగం వివాదంపై నేడు మూడు రాష్ట్రాల అధికారులు మరోసారి సమావేశం కానున్నారు.  కృష్ణా జలాలపై వివాదంలో మళ్లీ పాత కథే కొనసాగటంతో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ) అవార్డు తమకు అందివచ్చిన నేపథ్యంలో పట్టు వీడటానికి అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక ఏమాత్రం సిద్ధంగా లేకపోవడంతో చర్చలు ఫలించలేదు. ఈ చర్చలను ఇంజనీర్ల స్థాయిలో నేడు కూడా కొనసాగించాలని మూడు రాష్ట్రాలు ఓ అంగీకారానికి రావడం గమనార్హం. దీని ప్రకారం ట్రిబ్యునల్ విచారణ అయ్యాక మూడు రాష్ట్రాల ఇంజనీర్లు ట్రిబ్యునల్ కార్యాలయంలోనే సమావేశమై చర్చలు జరపనున్నారు.

ఏకాభిప్రాయ సాధన కోసం ట్రిబ్యునల్ చేసిన సూచన ప్రకారం ఆదివారం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర న్యాయవాదులు, ఉన్నతాధికారులు ఢిల్లీలోని కర్ణాటక భవన్ ‘కావేరి’ సమావేశ మందిరంలో భేటీ అయ్యారు. రాత్రి 7 గంటల నుంచి 8.15 వరకు ఈ సమావేశం జరిగింది. రాష్ట్రం తరఫున సీనియర్ న్యాయవాది డి.సుదర్శన్‌రెడ్డి, న్యాయవాది ఎం.ఆర్.శ్రీనివాస్, ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్, చీఫ్ ఇంజనీర్ ఎం.ఎ.రవూఫ్, నీటిపారుదల శాఖ జాయింట్ సెక్రటరీ ఎం.విశ్వేశ్వరరావు, ఇంజనీరింగ్ విభాగం ముఖ్యాధికారులు పి.ఆర్.కె.మూర్తి, వి.ఎస్.ఎన్.రాజు, వై.వి.ఎస్.రెడ్డి, సుబ్రహ్మణ్యం, గిరిధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు