మోదీకి 'పాక్' లేఖ: లష్కరే సంతకం

3 Oct, 2016 19:42 IST|Sakshi
మోదీకి 'పాక్' లేఖ: లష్కరే సంతకం
పఠాన్కోట్: ఉగ్రదాడికి గురైన పఠాన్ కోట్ ఎయిర్ బేస్ కు సమీపంలో ఆదివారం ఒక అనుమానాస్పద పావురాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన ఆ పావురాన్ని బమియాల్ సెక్టార్ లోని సింబాల్ పోస్టు వద్ద స్వాధీనం చేసుకున్నట్లు చెప్పిన బీఎస్ఎఫ్ అధికారులు.. పావురం కాలికి ఒక లేఖ కట్టిఉన్నట్లు వెల్లడించారు. ఉర్దూలో రాసి ఉన్న ఆ లేఖలో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ.. 'మోదీజీ మీ(ఇండియా)తో యుద్ధం చేయడానికి ఇక్కడి యువకులందరూ సిద్ధంగా ఉన్నారు. మమ్మల్ని నాటి(1971 యుద్ధంనాటి) వాళ్లకింద లెక్కకట్టకండి..' అని రాసి ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ ఉదంతంపై దర్యాప్తు ప్రారంభించిన పఠాన్ కోట్ పోలీసులు పావురాన్ని కస్టడీలోకి తీసుకున్నారు.
 
కాగా, పావురం లేఖలో సంతకంగా ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా పేరు ఉందని పఠాన్ కోట్ ఇన్ స్పెక్టర్ రాకేశ్ కుమార్ సోమవారం మీడియాకు తెలిపారు. ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకోబోమని, లోతైన దర్యాప్తు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే పంజాబ్, కశ్మీర్ సరిహద్దుల్లో భారత భద్రతా బలగాలు అప్పమత్తంగా వ్యవహరిస్తుండగా, పై నుంచి పావురం లేఖలు, బెలూన్ లెటర్లు వచ్చి పడుతున్నాయి. శనివారం కూడా ఇదే తరహాలోగురుదాస్‌పూర్‌లోని ఘేసల్ గ్రామం గాలిబుడగలకు కట్టిన లేఖలు పాక్ నుంచి ఇండియాకు వచ్చి వాలాయి. బెలూన్ల లేఖల్లోనూ 'మోదీజీ, సహనం అనే కత్తులు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి' అని ఉర్దూలో రాసిఉన్నట్లు పోలీసులు చెప్పారు. సెప్టెంబర్ 23న కూడా పంజాబ్‌లో హోషియార్‌పూర్ జిల్లాలో ఉర్దూలో రాసి ఉన్న ఉత్తరంతో ఉన్న ఓ తెల్ల పావురాన్ని భారత అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని వార్తలు