ఎల్పీజీ సిలిండర్‌పై రూ.1.50 పెంపు

2 Oct, 2017 03:22 IST|Sakshi

న్యూఢిల్లీ: 2018 మార్చికల్లా ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీలను ఎత్తివేయాలన్న కేంద్రం లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను మరోసారి పెంచాయి. ప్రస్తుతం 14.2 కేజీల రాయితీ సిలిండర్‌పై రూ.1.50 పెంచుతున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) ఆదివారం తెలిపింది. విమానాల్లో వాడే ఎయిర్‌ టర్బైన్‌ ఫ్యూయెల్‌ (ఏటీఎఫ్‌) ధరల్ని కిలోలీటర్‌కు రూ.3,025 (దాదాపు 6%) పెంచుతున్నట్లు పేర్కొంది. సబ్సిడీయేతర సిలిండర్‌పైనా రూ.1.50 పెంచుతున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల్లో మార్పులకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐవోసీ స్పష్టం చేసింది. గత ఆగస్టు 1న సిలిండర్‌పై రూ.2.30 పెంచిన కంపెనీలు సెప్టెంబర్‌లో ఏకంగా రూ.7 పెంచాయి. 2016 జూన్‌లో ఢిల్లీలో రూ.419.18గా ఉన్న సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.69.50 పెరిగి ప్రస్తుతం రూ.488.68కి చేరుకుంది. ప్రతినెలా 1న గత మాసంలో నమోదైన సగటు చమురు ధర, విదేశీమారక ద్రవ్య రేటు ఆధారంగా ఎల్పీజీ, ఏటీఎఫ్‌ ధరలను కంపెనీలు సవరిస్తున్నాయి.

మరిన్ని వార్తలు