తెలంగాణలో మెగా ఫుడ్‌పార్క్

1 Nov, 2014 02:00 IST|Sakshi

కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్‌శాఖ మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్
 
 సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రైతులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్‌శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్‌బాదల్ తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో మెగా ఫుడ్‌పార్క్‌ను ఏర్పాటు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. శుక్రవారం ఢిల్లీ పంచ్‌శీల్ భవన్‌లోని తన చాంబర్‌లో తెలంగాణ టీడీపీ నేతల ప్రతినిధి బృందంతో సమావే శమయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘ కొత్తగా ఏర్పడిన రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీ ఎంతో చేస్తున్నారు.  దేశవ్యాప్తంగా 17 మెగాఫుడ్ పార్క్‌లు మంజూరు చేశాం. ఇప్పటికే దాదాపు 78 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ముగ్గురు ఉన్నారు. అభ్యర్థుల దరఖాస్తులను మూడు కమిటీల ద్వారా స్క్రూటినీ చేసిన తర్వాత తుది జాబితాను సిద్ధం చేస్తాం. ప్రస్తుత ప్రతిపాదనల్లో కనీసం ఒక్క మెగాఫుడ్ పార్క్‌ను తెలంగాణకు కేటాయించేందుకు ప్రయత్నిస్తాం. లేదంటే వచ్చే నెలలో విడుదలయ్యే అదనపు నిధుల్లో మరికొన్ని మెగాఫుడ్‌పార్క్‌లను కేటాయిస్తాం’ అని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు