మహీంద్రా వాహన ధరల పెంపు

13 Dec, 2013 03:03 IST|Sakshi
మహీంద్రా వాహన ధరల పెంపు

న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కూడా వాహనాల ధరలను పెంచుతోంది. ప్రయాణికుల, వాణిజ్య వాహనాల ధరలను వచ్చే నెల 1 నుంచి 2% వరకూ పెంచుతోంది. అధిక ఉత్పత్తి వ్యయాలు తట్టుకోవడానికి ధరలను పెంచక తప్పడం లేదని మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ షా గురువారం చెప్పారు. ఇప్పటికే మారుతీ సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, హోండా కార్స్ ఇండియా, రేనాల్ట్ వంటి కంపెనీలే కాకుండా మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కంపెనీలు కూడా ధరలను పెంచుతున్నట్లు ప్రకటించడం తెలిసిందే.
 
 ఫోక్స్‌వ్యాగన్ పెంపు 2.5 శాతం: జర్మనీ కార్ల కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ కూడా ధరలను పెంచుతోంది. వచ్చే నెల 1 నుంచి ధరలను 2.5% వరకూ పెంచుతున్నామని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఎండీ అర్వింద్ సక్సేనా గురువారం తెలిపారు.  గత కొన్నేళ్లుగా ఉత్పత్తి వ్యయాలు పెరుగుతూనే ఉన్నాయని,   అత్యున్నత ప్రమాణాలున్న వాహనాలను అందించాలంటే ధరలను స్వల్పంగా పెంచక తప్పడం లేదని పేర్కొన్నారు. ఈ కంపెనీ భారత్‌లో పోలో, వెంటో, జెటా, పసంట్, టౌరేగ్, ఫేటాన్ మోడళ్ల కార్లను విక్రయిస్తోంది.

మరిన్ని వార్తలు