ఆ శకలాలు ఆ విమానానివేనా?

30 Jul, 2015 10:52 IST|Sakshi
ఆ శకలాలు ఆ విమానానివేనా?

అమెరికా : ఫ్రెంచ్లోని ల రియునియన్ ద్వీపం బంగాళాఖాతం తీర ప్రాంతంలో కనుగొన్న విమాన శకలాలు గుర్తించేందుకు ఓ బృందం ఇప్పటికే బయలుదేరి వెళ్లిందని మలేసియా రవాణా శాఖ మంత్రి ఎల్ టీ లై వెల్లడించారు. బుధవారం ఐక్యరాజ్యసమితిలోని భద్రత మండలిలో ఆయన మాట్లాడుతూ... ల రియూనియన్ ద్వీపంలోని తీర ప్రాంతానికి కొట్టుకువచ్చిన ఆ శిధిలాలు గతేడాది అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానానికి చెందినవా లేక కూలిన ఎమ్హెచ్ 17 విమానానికి చెందినవా అనేది తేల్చవలసిందన్నారు.

సదరు బృందం ఈ అంశంపై దర్యాప్తు జరిపి ఆ శకలాలు ఏ విమానానివో గుర్తించి సాధ్యమైనంత త్వరగా నివేదిక అందజేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  ల రియునియన్ ద్వీపంలోని బీచ్లో శుభ్రపరిచే కార్యక్రమాన్ని స్థానికులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు మీటర్లు వెడల్పు ఉన్న విమానం రెక్కను కనుగొన్నారు. అది ఎమ్హెచ్ 370 విమానానికి సంబంధించినదని స్థానికులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ అధికారులకు తెలిపారు. దాంతో  ఫ్రెంచ్ విమానయాన శాఖ ఉన్నతాధికారులు దీనిపై విచారణ ప్రారంభించారు.

239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం గత ఏడాది మార్చి 8వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది.  బయలుదేరిన 40 నిమిషాలకే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం మాత్రం కనిపించలేదు.

ఈ విమానంలో మలేసియా వాసులు, 154 మంది చైనా జాతీయులతోపాటు నలుగురు ఫ్రెంచ్ జాతీయులు, ఐదుగురు భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎమ్హెచ్ 370 విమానం ప్రమాదానికి గురైందని... ప్రయాణికులంతా మరణించారని మలేసియా ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు