ప్రియురాలి మెసేజ్‌తో ఆగిన పెళ్లి..!

14 May, 2017 14:31 IST|Sakshi
ప్రియురాలి మెసేజ్‌తో ఆగిన పెళ్లి..!

వరంగల్‌: మరి కొద్దిసేపట్లో పెళ్లి జరగనుందనగా.. పెళ్లి కూతురుకు వచ్చిన ఓ మెసేజ్‌తో  పెళ్లి అర్ధంతరంగా ఆగింది. పెళ్లి కుమారుడికి మరో యువతితో సంబంధం ఉందనే విషయం స్వయానే అతని ప్రియురాలే ఆమేకు మెసేజ్‌ చేసింది. దీంతో అప్రమత్తమైన వధువు పెళ్లి ఆపేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివరాలు..
నగరంలోని రామన్నపేటకు చెందిన యువతికి కృష్ణాజిల్లాకు చెందిన పేట భరత్‌ శ్రీనివాస్‌తో పెళ్లి నిశ్ఛయమైంది. ఆదివారం తెల్లవారుజామున పెళ్లి ముహుర్తం ఖరారైంది. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు ఖాజీపేటలోని శ్యామల గార్డెన్స్‌కు చేరుకున్నారు. అంతలో పెళ్లి కూతురు ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. ఆ మెసేజ్‌ చదివిన అనంతరం తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని పెద్దలకు చెప్పింది.

గతంలో ఓ అమ్మాయి జీవితంతో ఆడుకొని పెళ్లికి సిద్ధమైన పెళ్లి కొడుకును పోలీసులకు పట్టించింది. విషయం తెలుసుకున్న సుబేదారి పోలీసులు పెళ్లి మండపానికి చేరుకొని పెళ్లి కుమారుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.

పేట భరత్‌ శ్రీనివాస్‌ విజయవాడలోని హోమియోకేర్‌ ఇంటర్‌నేషనల్‌ ఆస్పత్రిలో రిలేషన్‌షిప్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సునిత అనే యువతితో ప్రేమ వ్యవహరం నడిపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో వాళ్లు చూసిన యువతిని పెళ్లి చేసుకోడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న సునిత పెళ్లి కూతురి ఫోన్‌ నంబర్‌ కనుక్కొని పూర్తి వివరాలతో ఆమెకు మెసేజ్‌ పంపడంతో పీఠల వరకు వచ్చిన పెళ్లి ఆగింది.

మరిన్ని వార్తలు