ప్రధాని మోదీ ఫొటోకు దండేసి నివాళులు!

30 Mar, 2017 16:38 IST|Sakshi
ప్రధాని మోదీ ఫొటోకు దండేసి నివాళులు!

మనం ఎవరిపైనైనా గౌరవాన్ని ప్రకటించాలంటే అందుకు పలు మార్గాలు ఉన్నాయి. ఒకటి శాలువ కప్పి సత్కరించడం, మరొకటి పూలదండ వేసి గౌరవించడం..కానీ ఎవరి ఫొటోకైనా దండేసి.. నివాళులర్పించారంటే అది కచ్చితంగా చనిపోయినవారే అయి ఉంటారు. కానీ,  ఓ బీజేపీ నాయకురాలు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోకు దండేసి నివాళులర్పించింది. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. 

ఇండోర్‌ మేయర్‌ మాలినీ గౌద్‌ చనిపోయిన తన భర్త ఫొటోతోపాటు పక్కన ఉన్న ప్రధాని మోదీ, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఫొటోలకు సైతం దండేసి నివాళులర్పించారు. దివంగత మాజీ కేబినెట్‌ మంత్రి లక్ష్మణ్‌ సింగ్‌ గౌవద్‌ సతీమణి అయిన ఆమె ఇటీవల తన ఇంట్లో ఓ వేడుక సందర్భంగా ఇలా ముగ్గురి ఫొటోలకు దండేసి.. కలకలం రేపారు. ఈ ఘటనపై స్పందించడానికి స్థానిక బీజేపీ నేతలు నిరాకరిస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని లేవనెత్తిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జితు పట్వారీ మేయర్‌ తీరును తప్పుబట్టారు. ఆమె బీజేపీ నాయకురాలైనందుకే ఆ పార్టీ చర్య తీసుకోవడం లేదని, ఇదే ఇతరులు చేస్తే నానా రాద్ధాంతం చేసేదని ఆయన విమర్శించారు. గతంలో డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం, అటల్‌ బిహారి వాజపేయి విషయంలోనూ ఇలాగే బతికుండగానే ఇలాగే ఫొటోలకు దండలు వేసిన ఘటనలు దుమారం రేపాయి.

మరిన్ని వార్తలు