వాషింగ్టన్ : టెక్ కంపెనీలకు చుక్కలు చూపిస్తున్న అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారతీయ సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లను భయపెట్టలేరట. ఆయనకు ట్రంప్ అంటే భయం లేదని తెలుస్తోంది. ఎందుకంటే జాబ్ క్రియేటర్గా ఎక్కువ అవకాశాలు ఆ టెక్ దిగ్గజం అమెరికన్లకే కల్పించిందట. ఈ విషయంలో ఆయన చాలా విశ్వసనీయంగా ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
తమ ప్రధానమైన ఉపాధి అవకాశాలు ఎక్కువగా అమెరికాలోనే ఉన్నాయని డిజిటల్ లైఫ్ డిజైన్ టెక్ కాన్ఫరెన్స్ సందర్భంగా సత్య నాదెళ్ల చెప్పారు. అమెరికాలో ఎక్కువ వేతనంతో కూడిన ఉద్యోగాలను తాము విపరీతంగా సృష్టించామని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్లో ప్రపంచవ్యాప్తంగా 1.13,00 మంది ఉద్యోగులుండగా.. వారిలో 64,000 మందికి పైగా అమెరికాలోని వారేనని తెలిపారు. వారిలో ఎక్కువగా వాషింగ్టన్ వారున్నారన్నారు.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవిలోకి వచ్చిన తర్వాత మైక్రోసాఫ్ట్ రోడ్మ్యాప్ ఏమీ మారవరని నాదెళ్ల చెప్పారు. అమెరికాకు చెందిన ఈ కంపెనీ ఆ దేశానికి ఎంతో బాధ్యతయుతంగా పనిచేస్తుందన్నారు. నవంబర్ 8న ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించగానే , టెక్ కంపెనీలన్నీ అమెరికన్లను రిక్రూట్ చేసుకోవడం ప్రారంభించాయని సీఎన్ఎన్ రిపోర్టుచేసింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లాంటివి కూడా అదనంగా ఉద్యోగాలు సృష్టిస్తున్నాయి.. గత నెల ట్రంప్తో భేటీ అయిన 12 టెక్ దిగ్గజ సీఈవోల్లో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా ఉన్నారు.
ఈ మీటింగ్లో అమెరికాలో ఉద్యోగాలు ఎక్కువగా కల్పించాలని, పెట్టుబడులు పెంచాలని టెక్ సీఈవోలకు ట్రంప్ హితబోధించారు. ట్రంప్ ప్రధాన ఎన్నికల సూత్రం అమెరికన్ ఉద్యోగాలు అమెరికన్లకే. టెక్ కంపెనీలు ఎక్కువగా ఉద్యోగాలు ఇతర దేశాల వారికి కల్పిస్తున్నాయని ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. తాను అధ్యక్ష పీఠం ఎక్కగానే అమెరికన్ ఉద్యోగాలన్నీ అమెరికాకే దక్కుతాయని వాగ్దానం చేశారు. ఈ మేరకు హెచ్1-బీ వీసాను మార్పులు చేయనున్నట్టు ప్రతిపాదనలు వస్తున్నాయి.