తొలిరివ్యూ: రావణుడిగా ఎన్టీఆర్‌ దుమ్మురేపాడా!

20 Sep, 2017 20:56 IST|Sakshi



'జై లవకుశ' ఫీవర్‌.. టాలీవుడ్‌ను, జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులను ఊపేస్తోంది. తొలిసారి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంతో తెరపై దుమ్మురేపడానికి సిద్ధమవుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్‌ బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వంలో సోదరుడు కల్యాణ్‌ రాం తెరకెక్కించిన ఈ సినిమాలో జై, లవ, కుశగా మూడు విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్‌ అలరించబోతున్నాడు. ఈ సినిమా కథ ఏమిటనేది ట్రైలర్‌ ద్వారా.. ఎన్టీఆర్‌ తాను ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా చూచాయగా చెప్పేశారు. రామలక్ష్మణుల్లా పెరగాల్సిన ముగ్గురు అన్నదమ్ములు రావణ, రామ-లక్ష్మణులుగా మారడమే ఇందులోని కథ. ఇందులో జై పాత్ర రావణుడి ఛాయలతో సాగుతోంది. నాటకాలు అధికంగా ఇష్టపడే జై.. రావణుడిలా ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.

రావణుడిని అభిమానించే 'జై' పాత్రపై ఇప్పటికే విశేషమైన క్రేజ్‌ ఏర్పడింది. ప్రతినాయకుడిగా తొలిసారి నటించిన ఎన్టీఆర్‌.. 'జై' పాత్రలో వీరోచితమైన అభినయాన్ని ప్రదర్శించినట్టు తెలుస్తోంది. 'జై' పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్‌కు, 'జైలవకుశ' ట్రైలర్‌కు ఆన్‌లైన్‌లో విశేషమైన స్పందన లభించింది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు కూడా బాగున్నాయనే టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా 'జై రావణ' పాట శ్రోతలను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో 'జైలవకుశ' ఎలా ఉండబోతుంది? అసలు కథలో ట్విస్టేమిటి? జై పాత్ర అంచనాలను అందుకుంటుందా? మరికాసేట్లో తేలనుంది.

ఇప్పటికే తారస్థాయి అంచనాలు ఉన్న ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీశ్రీ ప్రసాద్‌ ట్వీట్‌ చేశారు. 'జైలవకుశ' సినిమాను డైరెక్టర్‌ బాబీ అద్భుతంగా తెరకెక్కించారని, యంగ్‌టైగర్‌ ఎన్టీర్‌ మైండ్‌బ్లోయింగ్‌ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడని దేవీ ట్వీట్‌ చేశాడు. రావణా అంటూ 'జై' పాత్రలో ఎన్టీఆర్‌ అదరగొట్టినట్టు హింట్‌ ఇచ్చారు.

మరిన్ని వార్తలు