'మంత్రి నారాయణను అరెస్ట్ చేయాలి'

20 Aug, 2015 19:16 IST|Sakshi
'మంత్రి నారాయణను అరెస్ట్ చేయాలి'

అనంతపురం ఎడ్యుకేషన్: యముడిలాగా మంత్రి నారాయణ తన విద్యా సంస్థల్లో చదువుకుంటున్న పిల్లలను బలి తీసుకుంటున్నారని గురువారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో స్థానిక సప్తగిరి సర్కిల్‌లో వినూత్న రీతిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కడప జిల్లాలో చైతన్య కళాశాలలో ఇద్దరు విద్యార్థినులు మృతికి బాధ్యుడిని చేసి మంత్రి నారాయణను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కసాపురం ఆంజనేయులు, ఉపాధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ మృతి చెందిన విద్యార్థినుల ఒంటిమీద గాయాలు ఉండడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

ఎన్నో ఆశలతో విద్యా సంస్థల్లోకి అడుగుపెట్టిన విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్న నారాయణ విద్యా సంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన విద్యార్థినుల కుటుంబాలకు రూ. 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఐదేళ్లలో నారాయణ విద్యా సంస్థల్లో 136 మంది విద్యార్థులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నారాయణను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు