పట్నా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదేశాల మేరకే తనపై అవినీతి అభియోగాలు మోపారని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. తన వారసులు ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని, చట్టబద్ధంగా ఆస్తులు కూడబెట్టారని ఆయన తెలిపారు. ఆర్ఎస్ఎస్ కూడా తనకు వ్యతిరేకంగా పనిచేస్తోందని మండిపడ్డారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు. మోదీ సర్కారు ఈవిధంగా కక్ష సాధింపు చర్యలకు దిగితే ఐదేళ్లు కొనసాగదని అన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారును గద్దె దించుతామని ప్రతిన బూనారు. తనపై బురద చల్లితే మూల్యం చెల్లించుకోవాల్సివుంటుందని హెచ్చరించారు.
బీజేపీపై పోరాడేందుకు, భవిష్యత్ కార్యాచరణ కోసం ఆగస్టు 27న పట్నాలోని గాంధీ మైదాన్లో ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. భావసారూప్యం కలిగిన పార్టీల నాయకులను ఈ ర్యాలీకి ఆహ్వనిస్తున్నట్టు తెలిపారు. లాలూ ప్రసాద్ సన్నిహితులకు చెందిన కంపెనీల్లో ఈ నెలారంభంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే.