►వానరాన్ని చిత్రహింసలు పెట్టి చంపిన వైద్య విద్యార్థులు
► తమిళనాడులోని వేలూరులో ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి
వేలూరు (తమిళనాడు): చెన్నైలో కొంతమంది వైద్య విద్యార్థులు శునకాన్ని మిద్దెపై నుంచి కిందికి విసిరి చిత్రహింసలు పెట్టిన ఘటన మరువక ముందే అలాంటి మరొక సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వసతి గృహంలోకి ప్రవేశించిన ఒక వానరం కాళ్లు నరికి.. మెడ, కళ్లపై కత్తితో పొడిచి చిత్రహింసలకు గురిచేసిన అనంతరం.. దాన్ని వసతి గృహం ఆవరణలోనే పాతిపెట్టిన ఘటన తమిళనాడులోని వేలూరులో చోటుచేసుకుంది. జస్ఫర్ సామువేల్ సాహు, రోహిత్ కుమార్, అరుల్ లూయిస్, అలెక్స్ అనే నలుగురు విద్యార్థులు వేలూరు సీఎంసీలో మెడిసిన్ చదువుతూ కళాశాల వసతి గృహంలో ఉంటున్నారు.
ఈనెల 19న వీరు ఉంటున్న హాస్టల్లోకి ఒక వానరం వచ్చింది. ఆ సమయంలో అక్కడున్న ఈ నలుగురు దాన్ని పట్టుకుని టెలిఫోన్ తీగతో కట్టేశారు. అనంతరం దాని కాళ్లు నరికి, మెడ, కళ్లపై కత్తితో పొడుస్తూ ఆనందించారు. కొంతసేపటికి అది చని పోవడంతో హాస్టల్ ఆవ రణలోనే పాతిపెట్టారు. ఈ విషయాన్ని అదే కళాశాలలో చదువుతున్న ఒక విద్యార్థి ద్వారా తెలుసుకున్న ముంబైలోని మూగ జీవాల రక్షణ సంఘం సలహాదారుడు శిలవన్ క్రిష్ణన్ వేలూరులోని బాగాయం పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పాతి పెట్టిన కోతిని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఆ నివేదికలో చిత్రహింసలు పెట్టిన విషయం నిర్ధారణ అయింది. దీంతో నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. కళాశాల యాజమాన్యం కూడా సదరు విద్యార్థులను కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది.