పాకిస్థాన్‌కు మరో షాక్‌!

27 Sep, 2016 15:07 IST|Sakshi
పాకిస్థాన్‌కు మరో షాక్‌!

న్యూఢిల్లీ: ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు మరో షాక్‌ ఇచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కదులుతోంది. దాయాది పాకిస్థాన్‌కు ఇచ్చిన మోస్ట్‌ ఫేవర్డ్‌ (అత్యంత సన్నిహిత) దేశం హోదాను రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు.

18 మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న జమ్ముకశ్మీర్‌లోని ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచే దిశగా మోదీ సర్కార్‌ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాక్‌కు జీవనాడీ అయిన సింధు నదీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని ప్రధాని మోదీ సంకేతాలు ఇచ్చారు. ఇందుకోసం సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. పాకిస్థాన్‌కు ఉదారంగా జలాలు పంపిణీ చేస్తూ ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం నేపథ్యంలో సింధు జలాలను మనమే అత్యధికంగా ఉపయోగించుకునేవిధంగా ప్రత్యామ్నాయాలను ఈ సమావేశంలో చర్చించారు.

ఇక పాక్‌కు 1996లో భారత్‌ మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ (ఎంఎఫ్‌ఎన్‌) హోదా ఇచ్చింది. పాక్‌ మాత్రం మనకు ఆ హోదా ఇస్తామంటూ ఇన్నాళ్లూ ఊరిస్తూ వస్తున్నది కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఈ హోదా రద్దు చేసినా పెద్దగా ప్రభావం ఉండబోదని అసోచామ్‌ పేర్కొంది. 2015-16లో భారత్‌ విదేశీ వాణిజ్యం విలువ 641 బిలియన్‌ డాలర్లు కాగా, అందులో పాక్ వాటా కేవలం 2.67 బిలియన్‌ డాలర్లుమాత్రమే. ఆ దేశానికి భారత్‌ చేసే ఎగుమతులు చాలా తక్కువ కావడంతో ఈ హోదా రద్దు చేసినా ఆ ప్రభావం పెద్దగా ఉండదని అసోచామ్‌ వివరించింది. అయితే, పాకిస్థాన్‌ పై పూర్తిస్థాయిలో ఆర్థిక యుద్ధం ప్రకటించాలని భావిస్తున్న ప్రధాని మోదీ.. ఇందులో ఎంఎఫ్‌ఎన్‌ హోదా రద్దు కీలకమని భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు