దేవుడిచ్చిన వరం కేసీఆర్

23 Aug, 2015 02:43 IST|Sakshi
దేవుడిచ్చిన వరం కేసీఆర్

ఎంపీ కె. కేశవరావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు దేవుడిచ్చిన వరం ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. సికింద్రాబాద్‌కు చెందిన మైనార్టీ నేత సాజిద్ అలీ.. ఎంపీ కేశవరావు సమక్షంలో శనివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడపడంలో కేసీఆర్‌కు ఎవరూ సాటిరారని కేశవరావు సీఎంపై పొగడ్తల వర్షం కురిపించారు. తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కేసీఆర్ చేస్తున్న కృషికి అందరూ అండగా నిలవాలన్నారు.

నీటి పారుదల రంగంపై కేసీఆర్‌కు ఉన్నంత అవగాహన ఏ నేతకూ లేదని, ఆయన నాయకత్వంలో నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయి తెలంగాణ సస్యశ్యామలమవుతుందన్నారు. గ్రామీణ ప్రజల దీన స్థితికి చలించి కేసీఆర్ గ్రామజ్యోతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఆంధ్ర ప్రాంత పార్టీలకు తెలంగాణలో స్థానం లేదని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు.

మైనార్టీల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం కేసీఆర్ చేస్తున్న కృషికి అండగా నిలిచేందుకు  అందరూ కలిసిరావాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కోరారు. హైదరాబాద్‌ను డాలస్ తరహాలో అభివృద్ధి చేసేందుకు సీఎం అహరహం శ్రమిస్తున్నార న్నారు.

మరిన్ని వార్తలు