25 నిమిషాల ఆ స్పీచ్కు రూ.3000 కోట్లు ఆవిరి!

12 Dec, 2016 15:11 IST|Sakshi
25 నిమిషాల ఆ స్పీచ్కు రూ.3000 కోట్లు ఆవిరి!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 25 నిమిషాల స్పీచ్కు మేజర్ టెలికాం స్టాక్స్ అన్నీ గజగజలాడాయి. రిలయన్స్ జియో అందిస్తున్న ఉచిత సేవల ఆఫర్ మరో మూడు నెలల పాటు అంటే వచ్చే ఏడాది మార్చి 31వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించగానే దిగ్గజ టెలికాం స్టాక్స్ అన్నీ ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో టెలికాం దిగ్గజాల మార్కెట్ విలువ రూ.3000 కోట్లు ఆవిరైపోయింది. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ 1.66 శాతం, ఐడియా సెల్యులార్ 5.93 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్ 5.05 శాతం కుదేలయ్యాయి. ఈ సమయంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 శాతం లాభపడింది. ఒకటిన్నర మధ్యలో రూ.324గా ట్రేడ్ అయిన ఎయిర్టెల్ షేర్లు, ముఖేష్ స్పీచ్ ప్రారంభం కాగనే రూ.318.3కు దిగొచ్చాయి. దీంతో ఆ కంపెనీ మార్కెట్ విలువ రూ.2,276 కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. 
 
అదేవిధంగా 76.60గా ట్రేడ్ అయిన ఐడియా సెల్యులార్ షేర్లు కూడా ముఖేష్‌ స్పీచ్తో రూ.74.20కి పడిపోయాయి. ఈ కంపెనీ కూడా రూ.792 కోట్లను మార్కెట్ విలువను పోగొట్టుకుంది. నేడు దేశీయ మార్కెట్లో భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్ భారీగా నష్టపోయినట్టు మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. టెలికాం కంపెనీల మధ్య పోటీ తీవ్రతరమవుతుందని వారు పేర్కొన్నారు. సంచలమైన ఆఫర్లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు(సెప్టెంబర్1న) కూడా ఎయిర్టెల్, ఐడియా షేర్ల మార్కెట్ విలువ భారీగా కోల్పోయినట్టు, రూ.16,000కోట్లు తుడిచిపెట్టుకుపోయినట్టు వెల్లడించారు. మరోసారి హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద జియో సేవలను పొడిగించనున్నట్టు సంచలనమైన ప్రకటనను వాటాదారుల సమావేశంలో గురువారం రిలయన్స్ అధినేత వెల్లడించడంతో ఈ కంపెనీలు భారీగా నష్టపోయాయి. రూ.3000 కోట్ల మేర మార్కెట్ విలువను కోల్పోయాయి.  
మరిన్ని వార్తలు