యూపీలో ప్రచార పర్వానికి తెర తీయనున్న ములాయం

10 Oct, 2013 10:42 IST|Sakshi
యూపీలో ప్రచార పర్వానికి తెర తీయనున్న ములాయం

2014 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో అత్యధిక లోక్సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార సమాజవాది పార్టీ ప్రచార పర్వానికి తెరతీసింది. అందులోభాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా18 ర్యాలీల(బహిరంగ సభ)ల్లో పాల్గొనున్నారు. అందుకోసం ఈ నెల 29న అజాంఘర్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ద్వారా ములాయం ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుడతారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

 

రాష్ట్రంలోని రైతుల, పేద ప్రజలు, కార్మికుల కోసం అఖిలేష్ సింగ్ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఈ ర్యాలీలు ఉపయోగపడతాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ ర్యాలీలకు సంబంధించిన రోడ్డు మ్యాప్ అంతా ఇప్పటికే పూర్తి అయిందని తెలిపారు. అలాగే వివిధ దేశాల్లోని యూపీకి చెందిన ఎన్నారైల ఓట్లు కూడా సమాజవాది పార్టీకే పడేలా చేపట్టవలసిన చర్యలపై ఓ కొర్ కమిటీ ఏర్పాటు చేయాలని ఇప్పటికే ములాయం పార్టీ వర్గాలకు సూచించారని చెప్పారు. అయితే దేశంలో అత్యధిక లోక్సభ సీట్లు గల రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి.



ఆ రాష్ట్రంలో ఓట్ల కొల్లగొట్టే పనిలో ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్లు ఊహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఈ నెల 29న కాన్పూర్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ర్యాలీ నిర్వహించి బీజేపీ ప్రచార కార్యక్రమానికి తెరలేపనున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది ర్యాలీలు నిర్వహించాలని ఇప్పటికే బీజేపీ నిర్ణయించింది. అలాగే కాంగ్రెస్ 8 ర్యాలీలు నిర్వహించనుంది. అందులోభాగంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం అలీఘర్, రామ్పూర్లలో ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు