ముంబై అత్యాచారం: నలుగురు నిందితులకు 19 వరకు కస్టడీ

5 Sep, 2013 13:19 IST|Sakshi

ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులను ఈనెల 19 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ముంబైలోని ఓ మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులిచ్చింది. షిరాజ్ రెహ్మాన్ ఖాన్, విజయ్ జాదవ్, ఖాసిం బెంగాలీ, సలీమ్ అన్సారీలను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని మేజిస్ట్రేట్ యూఎం పద్వాడ్ ఆదేశించారు. వాళ్లతో ఐడెంటిఫికేషన్ పెరేడ్ నిర్వహించాలని క్రైం బ్రాంచి కోరడంతో కస్టడీకి పంపారు. అంతకుముందు విధించిన పోలీసు కస్టడీ గురువారంతో ముగిసింది.

ఈ కేసులో మరో మైనర్ నిందితుడిని ఆగస్టు 30న జువెనైల్ కోర్టులో ప్రవేశపెట్టగా అక్కడినుంచి డోంగ్రిలోని జువెనైల్ రిమాండ్ హోంకు పంపారు. అతడిపై నేరం రుజువైతే గరిష్ఠంగా మూడు సంవత్సరాల శిక్ష మాత్రమే పడుతుంది. అదే ఇతర నిందితులకైతే కనీసం ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు పడే అవకాశం ఉంది. నిందితులలో ఒకరి సోదరుడు అతడు చదివిన స్కూలు నుంచి టీసీ తీసుకొచ్చి, అతడు 1997 ఫిబ్రవరిలో పుట్టినట్లు నిరూపించడంతో ఆ నిందితుడిని మైనర్గా నిర్ధరించారు.

మరిన్ని వార్తలు