'రాహుల్ పశ్చాత్తాప యాత్రలు చేస్తే మంచిది'

27 May, 2015 13:06 IST|Sakshi
'రాహుల్ పశ్చాత్తాప యాత్రలు చేస్తే మంచిది'

గుంటూరు: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షడు రాహుల్ గాంధీ రైతు యాత్రలు కాదు పశ్చాత్తాప యాత్రులు చేస్తే మంచిదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు. మోదీ దేశ ప్రధానిగా పాలన పగ్గాలు చేపట్టి మంగళవారానికి ఏడాది పూర్తి అయింది. ఈ నేపథ్యంలో బీజేపీ దేశవ్యాప్తంగా జన కల్యాణ్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా బుధవారం గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మురళీధరరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మురళీధరరావు మాట్లాడుతూ... మోదీ ప్రధాని అయ్యాక దేశం ఆర్థికవృద్ధిలో ముందడుగు వేస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం అనే రెండు పాదాలపై తమ ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి తమ పార్టీ అనేక విషయాల్లో సహకరించిందని మురళీధరరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. దక్షిణాదిలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎదిగేందుకు పార్టీ అగ్రనేతలు రోడ్ మ్యాప్ సిద్ధం చేశారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో గతంలోనే తమ పార్టీ స్పష్టత ఇచ్చిందని తెలిపారు.

మరిన్ని వార్తలు