శివుని ఆలయంలో ఓ అరుదైన ఘటన!

25 Oct, 2016 13:13 IST|Sakshi
శివుని ఆలయంలో ఓ అరుదైన ఘటన!
  • ముస్లిం జంటకు నిఖా చేసిన గ్రామస్తులు
  • ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ పెద్దలు, సమాజం ఒప్పుకోదేమోనన్న భయంతో ఇంటి నుంచి పారిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు గ్రామానికి తిరిగి వచ్చిన ఆ జంట అనూహ్యరీతిలో గ్రామస్తులు హిందూ ఆలయమైన శివుని దేవాలయంలో నిఖా (పెళ్లి) చేశారు. దేశవ్యాప్తంగా మతపరమైన అసహనాలు, దాడులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో మతసామరస్యం వెల్లివిరిసే ఈ ఘటన బిహార్‌లో జరిగింది.

    నేపాల్‌ సరిహద్దుల్లో ఉన్న బిహార్‌ సుపౌల్‌ జిల్లాలోని  భీమ్‌నగర్‌ గ్రామానికి చెందిన మహమ్మద్‌ సోహాన్‌ (25), నురెషా ఖటూన్‌ (20) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కొన్నిరోజుల కిందట గ్రామానికి తిరిగి వచ్చిన ఈ జంటకు గత వారంలో గ్రామస్తులు శివుడి ఆలయం పరిసరాల్లో ఘనంగా నిఖా జరిపారు. వీరి పెళ్లి వేడుకకు గ్రామంలోని ముస్లింలు, హిందువులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. మౌల్వీ మహమ్మద్‌ జఫర్‌ పెళ్లి పెద్దగా ఉండి ఈ నిఖా జరిపించారు.

    ప్రేమ ఎప్పటికైనా గెలిచితీరుతుందన్న సందేశాన్ని చాటడానికి ఈ పెళ్లి జరిపిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మత విద్వేషాల్ని రెచ్చగొడుతున్న వారికి గట్టి సందేశం ఇచ్చి.. మత సామరస్యాన్ని చాటిచెప్పడానికి ఈ నిఖాను శివుడి ఆలయం పరిసరాల్లో జరిపించామని గ్రామ సర్పంచ్‌ సుధీర్‌కుమార్‌ సింగ్‌ తెలిపారు. శివుడి ఆలయ పరిసరాల్లో​ ఒక్కటైన నూతన జంటకు హిందు, ముస్లింలు తమ ఆశీర్వాదాలు అందించారు.  

మరిన్ని వార్తలు