యువతితో మాట్లాడాడని స్తంభానికి కట్టేసి..

25 Aug, 2015 14:38 IST|Sakshi
యువతితో మాట్లాడాడని స్తంభానికి కట్టేసి..

మంగళూరు: సహచర ఉద్యోగినితో మాట్లాడాడనే కారణంతో ఓ ముస్లిం వ్యక్తిని చితకబాదిన ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి మొత్తం 13మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొంతమంది భజరంగ్ దళ్ కార్యకర్తలు ఉన్నారు. పోలీసుల వివరాల ప్రకారం 29 ఏళ్ల ముస్లిం వ్యక్తి ఓ హిందూ యువతితో కారులో ఉండగా ఒక్కసారిగా ఓ గుంపు అతడిపై దాడి చేసింది. బట్టలూడదీసి కొట్టడమే కాకుండా వీధుల వెంట పరుగెత్తించారు. అనంతరం ఓ విద్యుత్ స్తంభానికి కట్టేసి దాదాపు గంట సేపు పిడిగుద్దులు గుప్పించారు.

దీనికి సంబంధించిన ఫొటోలు స్థానిక టీవీ చానెల్లలో, వాట్సాప్లో హల్ చల్ రేపడంతో పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. అయితే, బాధితుడు మాత్రం తాను.. ఆ యువతి ఒక మాల్ లో పనిచేస్తున్నామని, ఆమె లోన్ కట్టేందుకు డబ్బులు అవసరం ఉన్నాయని అడగడంతో ఇచ్చేందుకు ఏటీఎం వద్దకు కారులో వెళ్లానని ఇంతలోనే వారు వచ్చి దాడి చేశారని తెలిపాడు. ఈ విషయంలో ఆ అమ్మాయి జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినా ఆమెను కూడా తిట్టారని, ఆమె మాటలు పట్టించుకోలేదని వివరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు