కూతుర్ని రేప్‌ చేసిన కొడుకుని కాపాడేందుకు..

22 May, 2017 09:24 IST|Sakshi
కూతుర్ని రేప్‌ చేసిన కొడుకుని కాపాడేందుకు..

- ఐదేళ్ల చిన్నారిపై తండ్రి అత్యాచారం
- కొడుకును కాపాడేందుకు మనవరాల్ని చంపిన నానమ్మ

నాసిక్‌:
ఐదేళ్ల పసిమొగ్గను కన్నతండ్రే చిదిమేశాడు. ఈ విషయం బయటికి తెలిస్తే పరువుపోతుందని నానమ్మే ఆ పాపను చంపేసింది. మహారాష్ట్రలోని నాసిక్‌లో చోటుచేసుకున్న ఈ దారుణ సంఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలిలాఉన్నాయి..

సచిన్‌ షిండే అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నాసిక్‌ సమీప జవులేక్‌వాని గ్రామంలో నివసిస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో డ్యూటీ నుంచి తిరిగొచ్చిన అతను.. ఐదేళ్ల కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. సచిన్‌ ఈ దారుణానికి పాల్పడుతుండగా అతని తల్లి అనుసాయా చూసింది. మృగాన్ని అడ్డుకొని, పాపను కాపాడాల్సిందిపోయి ఆమె మరింత రాక్షసంగా ఆలోచించింది. కూతుర్ని రేప్‌ చేశాడని తెలిస్తే సచిన్‌ను పోలీసులు పట్టుకెళతారని భయపడి.. మనవరాలి గొంతు నులిమి చంపేసింది! ఆ సమయంలో సచిన్‌ భార్య ఇంట్లో లేదు.

పాప శవాన్ని తీసుకెళ్లి సమీపంలోని ఓ స్కూల్‌ గోడ వద్ద పడేసింది అనుసాయా. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి, తన మనవరాలిని ఎవరో కిడ్నాప్‌చేసి, హత్యచేశారని తప్పుడుకేసు పెట్టింది. రంగంలోకి దిగిన పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌తోపాటు పాప మృతదేహా వద్దకు వెళ్లరు. వాసన పసిగట్టిన పోలీసు జాగిలాలు షిండే ఇంటివైపునకు పరుగెత్తాయి. దీంతో పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి..

సచిన్‌, అతని తల్లి అనుసాయాలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారని, సచిన్‌పై అత్యాచారం, పోక్సో చట్టంకింద, అనుసాయాపై హత్యానేరంకింద కేసులు నమోదుచేసి రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ దేవిదాస్‌ పాటిల్‌ మీడియాకు చెప్పారు.

మరిన్ని వార్తలు