ఆ 'రహస్యాల' వెల్లడి గర్వకారణం: మోదీ

23 Jan, 2017 09:41 IST|Sakshi
ఆ 'రహస్యాల' వెల్లడి గర్వకారణం: మోదీ

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 121వ పుట్టినరోజు సందర్భంగా సోమవారం జాతి యావత్తూ ఆయనను స్మరించుకుంది. నేతాజీ ఓ గొప్ప మేధావి అని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం తపించేవారని, వలస పాలకులకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం చిరస్మరనీయమని ప్రధాని నరేంద్రమోదీ గుర్తుచేశారు. "ఆ మహోన్నత నాయకుడికి సంబంధించిన ఫైళ్లను వెల్లడించే అవకాశం మా ప్రభుత్వానికి దక్కడం గర్వకారణం"అని మోదీ ట్వీట్‌ చేశారు. అరుణ్‌జైట్లీ, రాజ్యవర్థన్‌ రాథోడ్‌ సహా పలువురు కేంద్రమంత్రులు సైతం నేతాజీని స్మరిస్తూ ప్రకటనలుచేశారు. (నేతాజీ రహస్య ఫైళ్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

సుభాష్‌ చంద్రబోస్‌ 1897, జనవరి 23న ఒడిశాలోని కటక్‌ పట్టణంలో జన్మించారు. తల్లిదండ్రుల పేర్లు ప్రభావతిదేవి, జానకినాథ్‌ బోస్‌. కటక్‌లోని రావెన్షా కాలేజియట్‌ స్కూల్లో, కోల్‌కతాలోని స్కాటిష్‌ చర్చి కాలేజీలో, ఆపై కేంబ్రిడ్జి యూనివర్సిటీలో సుభాష్‌ చదువు పూర్తిచేశారు. 1920లో ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాసిన బోస్‌.. జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించారు. అయితే ఏడాది తిరిగేలోపే ఉద్యోగాన్ని వదిలేసి జాతీయ కాంగ్రెస్‌ పార్టీలో చేరి స్వాతంత్ర్య సంగ్రామంలోకి దూకేశారు. రెండు సార్లు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడిగానూ పనిచేసిన ఆయన.. మహాత్మా గాంధీతో సిద్ధాంతపరమైన విబేధాలు తలెత్తడంతో కాంగ్రెస్‌ను వీడి ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీని స్థాపించి పోరాటాన్ని కొనసాగించారు.
('నేతాజీ' ఫైళ్లు చెప్పిన నిజం)

రెండోప్రపంచ యుద్ధం సమయంలోనే బ్రిటిషర్లను దెబ్బకొట్టాలనే సంకల్పంతో నేతాజీ భారీ ప్రణాళికలు రచించారు. జపాన్‌ సహకారంతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటుచేశారు. ఈ ప్రయత్నాలు సాగుతుండగానే 1945, ఆగస్టు 18న నేతాజీ ప్రయాణిస్తోన్న విమానం అంతర్థానమైంది. ఆ తర్వాత బోస్‌కు సంబధించి రకరకాల వార్తలు వెలువడ్డాయి. దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఆయన డెత్‌ మిస్టరీ ఇంకా విడలేదు. ఈ నేపథ్యంలో నేతాజీకి సంబంధించిన రహస్య ఫైళ్లను మోదీ సర్కారు గత ఏడాది బహిర్గతం చేసింది. వాటిపైనా విమర్శలు చెలరేగడం తెలిసిందే. (నేతాజీ 'రహస్యం' పెద్ద జోకా?)

మరిన్ని వార్తలు