ఏదైనా అద్భుతం జరిగితే తప్ప..!?

2 Aug, 2016 15:05 IST|Sakshi
ఏదైనా అద్భుతం జరిగితే తప్ప..!?

వారణాసి: వరుస ఎదురుదెబ్బల నడుమ గత వైభవం కోసం ఆరాటపడుతున్న కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై భారీ ఆశలే పెట్టుకుంది. అందరి కన్నా ముందే పక్కా వ్యూహంతో ఎన్నికల ప్రచారభేరిని మోగిస్తున్న ఆ పార్టీ యూపీ గడ్డపై సత్తా చాటాలని తాపత్రయపడుతోంది. అయితే, ఇదంతా ఆషామాషి విషయం కాదని హస్తం నేతలే అంగీకరిస్తున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప యూపీ ఎన్నికల్లో తాము గట్టెక్కలేమని యూపీ పీసీసీ చీఫ్‌ రాజ్‌ బబ్బర్‌ కుండబద్ధలు కొట్టారు.   

అయితే, ఆ అద్భుతం మంగళవారం వారణాసిలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ రోడ్డుషోతో ప్రారంభమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ నియోజకవర్గమైన వారణాసి ప్రధాన టార్గెట్‌గా సోనియాగాంధీ మంగళవారం ప్రచార శంఖారావాన్ని పూరిస్తున్నారు. ఇందులో భాగంగా వారణాసిలో ఆమె రోడ్డుషోలో పాల్గొంటున్నారు. 6.4 కిలోమీటర్ల దూరంపాటు ఈ బైక్‌ ర్యాలీ.. రోడ్డుషో జరగనుంది. అనంతరం జరిగే భారీ బహిరంగ సభలో సోనియా ప్రసంగిస్తారు. ఈ రోడ్డు, బహిరంగ సభ ద్వారా తమ బలాన్ని చాటాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే యూపీ సీఎం అభ్యర్థిగా ఢిల్లీ మాజీ ముఖ్యమం‍త్రి షీలా దీక్షిత్‌ను కాంగ్రెస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల కోసం ప్రియాంకగాంధీతోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేయించాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు