అమెరికాలో భారతీయ చిన్నారి హత్య!

21 Aug, 2016 18:13 IST|Sakshi
అమెరికాలో భారతీయ చిన్నారి హత్య!
న్యూయార్క్: మూడు నెలల క్రితం అమెరికాకు వెళ్లిన తొమ్మిదేళ్ల భారతీయ చిన్నారి దారుణ హత్యకు గురైంది. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో తండ్రితో ఉండేందుకు వెళ్లిన ఆ చిన్నారి బాత్టబ్‌లో శవమై తేలింది. కాగా సవతి తల్లే ఈ హత్యకు పాల్పడి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
 
చిన్నారి అష్‌దీప్ కౌర్ న్యూయార్క్‌లోని క్వీన్స్ ప్రాంతంలో తండ్రి సుఖ్జిందర్ సింగ్, సవతి తల్లి అర్జున్ సమ్దితో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. అదే ఇంట్లో మరో జంట సైతం ఉంటోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం బాత్ రూంలో అష్‌దీప్ కౌర్ మృతదేహాన్ని గుర్తించారు. కాగా, అర్జున్ సమ్దీతో కలిసి అష్‌దీప్ బాత్‌రూంకు వెళ్తుండగా చూశామని అందే ఇంట్లో ఉన్న వ్యక్తి వెల్లడించారు. అష్‌దీప్ మృతదేహాన్ని కనుగొన్న సమయంలో అర్జున్ సమ్దీ పరారీలో ఉండగా పోలీసులు వెతికి పట్టుకున్నారు. నీళ్లు లేని బాత్ టబ్‌లో పడి ఉన్న బాలిక మృతదేహంపై గొంతుతో పాటు పలుచోట్ల గాయాలను గుర్తించారు. మారు తల్లే గొంతు నులిమి హత్య చేసి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపతున్నారు.
 
కాగా, అష్‌దీప్ అంటే అర్జున్ సమ్దీకి అసలు ఇష్టం ఉండేది కాదని, పలు మార్లు కొట్టడం తాము గమనించామని, అయితే ఇంత ఘాతుకానికి పాల్పడుతుందని ఊహించలేదని బంధువులు అంటున్నారు. సుఖ్జిందర్ సింగ్‌తో విడాకులు తీసుకొని భారత్‌లో ఉన్న అష్దీప్ తల్లి.. కూతురు మరణ వార్త విని కుప్పకూలింది.
 
మరిన్ని వార్తలు