కోరికను బయటపెట్టిన హీరోయిన్‌!

3 Jun, 2017 21:00 IST|Sakshi
కోరికను బయటపెట్టిన హీరోయిన్‌!

హాట్‌హాట్‌ పాత్రలతో తమిళనాడులో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నీతూ చంద్ర ఇప్పుడు రాణి కావాలని తహతహలాడుతోంది. రాణిగా కనిపించాలన్న తన కోరికను ఇటీవల ఈ జాణ బయటపెట్టింది. సంఘమిత్రతో సినిమాతో ఆ కోరిక తీర్చుకోవాలనుకుంటోంది. శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మించబోతున్న భారీ చారిత్రక కథా చిత్రం సంఘమిత్ర. సుందర్‌ సీ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో జయంరవి, ఆర్య కథానాయకులుగా నటించనున్నారు. కథానాయికగా ఎంపికైన నటి శ్రుతీహాసన్‌ ఈ చిత్రం నుంచి అనూహ్యంగా వైదొలగడంతో ఆ అవకాశం కోసం చాలామంది కన్నేశారు.

అందులో నటి నీతూచంద్రా ఒకరు. ఆదిభగవాన్‌ చిత్రంలో నాయికగా యాక్షన్‌ సన్నివేశాల్లోనూ నటించిన ఈ అమ్మడు ఇటీవల వైగైఎక్స్‌ప్రెస్‌ చిత్రంలో మెరిసింది. సంఘమిత్రలో యువరాణిగా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమె తాజాగా మీడియాకు చెప్పింది. ఒక రంగస్థల నటిగా, కరాటే క్రీడాకారిణిగా సంఘమిత్ర పాత్రకు జీవం పోయడానికి తాను శాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది.

అయితే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చారిత్రక కథాచిత్రంలో కథానాయిక పాత్రకు అగ్రనటిని తీసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని తెలుస్తోంది. హన్సిక పేరు సంఘమిత్ర కోసం ఎంచుకున్నారని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా నయనతార, అనుష్క వంటి ప్రముఖ హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మరి కొద్ది రోజుల్లో సంఘమిత్ర నాయిక  ఎవరన్నది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు