నితీశ్‌ స్కెచ్‌.. 4నెలల ముందే తెలుసు!

27 Jul, 2017 11:53 IST|Sakshi
నితీశ్‌ స్కెచ్‌.. 4నెలల ముందే తెలుసు!

న్యూఢిల్లీ: మహాకూటమితో తెగదెంపులు చేసుకొని తాజాగా బీజేపీతో చేతులు కలిపిన జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌పై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మండిపడ్డారు. నితీశ్‌కుమార్‌ తమను మోసం చేశాడని దుయ్యబట్టారు. 'నితీశ్‌ మళ్లీ ఎన్డీయేలో చేరాలని ప్రయత్నిస్తున్న విషయం మూడు, నాలుగు నెలల కిందటే మాకు తెలిసు. అప్పటినుంచే ఆయన మంతనాలు జరుపుతున్నారు. తమ స్వార్థం కోసం కొందరు ఏమైనా చేస్తారు. నితీశ్‌కుమార్‌ మమల్ని మోసం చేశారు' అని రాహుల్‌ ఫైర్‌ అయ్యారు.

'మతవాదానికి (కమ్యూనలిజానికి) వ్యతిరేకంగా పోరాటం చేయమని ప్రజలు నితీశ్‌కు తీర్పు ఇచ్చారు. కానీ  ఆయన తన వ్యక్తిగత రాజకీయాల కోసం బీజేపీతో చేతులు కలిపారు' అని రాహుల్‌ అన్నారు. బిహార్‌లో నిన్నటివరకు అధికారంలో ఉన్న మహాకూటమి సంకీర్ణ ప్రభుత్వంలో మైనర్‌ భాగస్వామిగా కాంగ్రెస్‌ పార్టీ కొనసాగిన సంగతి తెలిసిందే. హఠాత్తుగా నితీశ్‌కుమార్‌ మహాకూటమిని వీడి సీఎం పదవికి రాజీనామా చేయడం.. ఆ వెంటనే బీజేపీతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం కాంగ్రెస్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నితీశ్‌ తీరుపై కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.

>
మరిన్ని వార్తలు