న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ బ్లాక్ మనీ దెబ్బ ప్రముఖ ఈ కామర్స్ సైట్లను కూడా తాకింది. రూ.500, రూ.1000ల నోట్లను అనూహ్యంగా బ్యాన్ చేయడంతో ఫ్లిప్కార్ట్, అమెజాన్, బిగ్ బాస్కెట్ సంస్థలు స్పందించాయి. ప్రభుత్వం చర్యలకు అనుగుణంగా తమ వ్యాపారంలోమార్పులు ప్రకటించాయి. పెద్ద కరెన్సీ నోట్లను రద్దుచేయడంతో తాజా ఆర్డర్లపై క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) సర్వీసులను ఈ రెండు రోజులు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించాయి. రూ.2000 వేలకు పైన ఉత్పత్తులపై క్యాష్ ఆన్ డెలీవరీ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిందని జాతీయ మీడియా రిపోర్టు చేసింది. అలాగే ఫ్లిప్కార్ట్ ప్రస్తుతం క్యాష్ ఆన్ డెలివరీ సేవలను అనుమతించడం లేదని బ్లూం బర్గ్ నివేదించింది. వెయ్యి రూపాయలకు పైన విక్రయాలపై సీఓడీ ఆప్షన్ ను నిలిపివేసినట్టు ఫ్లిప్ కార్ట్ ప్రతినిధి తెలిపారు. అమెజాన్ కూడా సీవోడి ఆప్లన్ డిసేబుల్ చేసింది. కొన్ని ఫూడ్ డెలివరీ సంస్థలు కూడా ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి. అయితే ప్రభుత్వ నిర్ణయం భారత్ లో క్యాష్ లెస్ ఎకానమీ సృష్టికి ఇది సానుకూల నిర్ణయమని వెంచర్ కేటిటిస్ట్స్ సహ వ్యవస్థాపకుడు అపూర్వ రంజన్ శర్మ వ్యాఖ్యానించారు. నల్లధనాన్ని వెలికితీసి, అవినీతిని నిరోధించే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ఈ కామర్స్ రంగానికి కొత్త కోణాన్ని అందిస్తుందన్నారు. పాక్షికంగా సామాన్యుడికి కొంత ఇబ్బంది కలిగినా, డిజిటల్లో చెల్లింపుల్లో ఇదొక విప్లవమని ఆయన వ్యాఖ్యానిచారు. పిన్ టెక్ స్టార్ట్ అప్ కంపెనీలకు స్వర్ణయుగం మొదలైందని ఆయన కితాబిచ్చారు.
కాగా దేశంలో నల్లధనాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రధాని అనూహ్యంగా పెద్దనోట్ల చెలామణిని రద్దుచేస్తున్నట్టు మంగళవారం రాత్రి ప్రకటించారు. దీనికనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ఈ ఆకస్మిక ప్రకటనపై ఒక వైపు ప్రశంసలు వెల్లువ కురుస్తుండగా, మరోవైపు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు, టోల్ ప్లాజాలు, ఏటీఎం సెంటర్లతో సహా పలు కొనుగోలుకేంద్రాల వద్ద ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.