చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత మృతి అనంతరం అనేక రాజకీయ పరిణామాలకు వేదికగా నిలిచిన తమిళనాడులో ప్రస్తుతం విచిత్ర పరిస్థితి నెలకొంది. తమిళనాడులో ప్రస్తుతం ఇన్చార్జీలే పాలన సాగిస్తున్నారు. మహారాష్ట్ర గవర్నర్ అయిన సీహెచ్ విద్యాసాగర్ రావు తమిళనాడుకు ఇన్చార్జ్ గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
ఇక తమిళనాడులోని స్థానిక సంస్థల్లో కూడా ఇన్చార్జీ పాలనే కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయడంతో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల చేతుల్లో స్థానిక సంస్థల పరిపాలన నడుస్తోంది. తమిళనాడులోనే అత్యంత విచిత్ర పరిస్థితి ఇదని, తమిళనాడు చరిత్రలోనే ఇలా మొదటిసారి అయి ఉండొచ్చునని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వం డ్రామా కొనసాగుతూనే ఉంది.