నవంబర్‌లోగా ఈ- పహాణీల్లో వివరాల నమోదు

17 Oct, 2015 03:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ పహాణీల్లో డేటా ఎంట్రీని నవంబర్‌లోగా పూర్తి చేయాలని భూపరిపాలన విభాగం ముఖ్య కమిషనర్(సీసీఎల్‌ఏ) అధర్‌సిన్హా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రెవెన్యూ అంశాలకు సంబంధించి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహ సీల్దార్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ-పహాణీలోని 15 నుంచి 31 అంశాల్లో ఈ ఏడాది పంట వివరాలను వెంటనే నమోదు చేయాలని అధర్‌సిన్హా అధికారులను ఆదేశించారు. ఆపై
 1 నుంచి 14 అంశాల్లో భూమి వివరాలను పొందుపరచాలని సూచించారు.  

జిల్లాలవారీగా రైతుల ఆధార్ సీడింగ్‌ను త్వరితగతిన పూర్తిచేయాలని, ఉద్యోగుల వివరాలను కూడా కంప్యూటరీకరించాలన్నారు. చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణకు సంబంధించి భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 409 మంది దరఖాస్తుదారులు ఏకమొత్తంలో సొమ్ము చెల్లించారని, వీరిలో ఆర్హులైనవారికి తక్షణం ఆయా భూములను రిజిస్ట్రర్ చేయాలన్నారు. రిజిస్ట్రేషన్‌కు అవసరమైన మార్గదర్శకాలు, కన్వీనియన్స్ డీడ్‌కు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, సర్కారు ఆమోదం తెలిపిన వెంటనే వాటిని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తె స్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు