పాత రూ.500 నోటుపై మరిన్ని ఆంక్షలు

8 Dec, 2016 17:48 IST|Sakshi
పాత రూ.500 నోటుపై మరిన్ని ఆంక్షలు
న్యూఢిల్లీ : పాత రూ.500 నోట్ల చెల్లుబాటుపై కేంద్రప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించింది. ఈ నెల 10వరకే రైల్వేలు, మెట్రోలు, బస్సుల్లో రూ.500 నోట్లు చెల్లుబాటు అవుతాయని వెల్లడించింది. డిసెంబర్ 10 తర్వాత ఈ నోట్లు వారి దగ్గర చెల్లుబాటు కావని తేల్చిచెప్పింది. ముందస్తు మార్గదర్శకాల మేరకు, డిసెంబర్ 15వరకు అన్ని వినియోగ బిల్లు చెల్లింపులతో రైల్వే టిక్కెట్ కౌంటర్లలోనూ, బస్ టిక్కెట్ల కొనుగోలుకు పాత రూ.500 నోట్లు వాడకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. కానీ ఈ తుదిగడువును రైల్వేలు, మెట్రోలు, బస్టిక్కెట్ల కొనుగోళ్లలో ప్రభుత్వం కుదించింది.
 
కాగ, 2016 డిసెంబర్ 3 నుంచి పాత రూ.500 నోట్లను పెట్రోల్, డీజిల్, గ్యాస్ స్టేషన్లలో, విమానయాన టిక్కెట్ల కొనుగోళ్లలో రద్దుచేసిన సంగతి తెలిసిందే.  నవంబర్ 8న ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన అనంతరం కేవలం 72 గంటలే ఈ నోట్లు పలు వినియోగ చెల్లింపులకు వాడుకోవచ్చని తెలిపింది. కానీ ఈ గడువును వినియోగదారుల సౌకర్యార్థం ప్రభుత్వం రెండు సార్లు  పొడిగించింది. ఈ పొడిగింపులో భాగంగా డిసెంబర్ 15వరకు పాత రూ.500 నోట్లు విద్యుత్, మంచినీళ్లు, పాఠశాలల ఫీజులు, ప్రీపెయిడ్ మొబైల్ బిల్లులు, ఇంధన కొనుగోళ్లకు, విమానయాన టిక్కెట్ బుకింగ్స్ వంటి వినియోగ బిల్లులకు వాడుకోవచ్చని తెలిపిన విషయం విదితమే.  
మరిన్ని వార్తలు