చిన్నారిపై సిరంజి సైకో దాడి!

6 Sep, 2015 02:10 IST|Sakshi
చిన్నారిపై సిరంజి సైకో దాడి!

- బైక్‌పై వచ్చి సూదితో గుచ్చి పరారీ
- హైదరాబాద్ మల్కాజిగిరిలో ఘటన
హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాలను వణికిస్తున్న ‘సిరంజి’ సైకో తరహా దాడి హైదరాబాద్‌లోనూ చోటుచేసుకుంది! తొమ్మిదేళ్ల చిన్నారిపై ఓ అగంతకుడు ఇంజక్షన్ సూదితో గుచ్చి పరారైన ఘటన నగరంలోని మల్కాజిగిరిలో శనివారం ఉదయం జరిగింది. మల్కాజ్‌గిరి పరిధిలోని ఇందిరానెహ్రూ నగర్‌కు చెందిన యాదగిరి, లావణ్య దంపతుల కుమార్తె రమ్య (9). స్థానికంగా ఉన్న న్యూ లిల్లీ మోడల్ స్కూల్లో నాల్గో తరగతి చదువుతుంది. శనివారం గురు పూజోత్సవం కావ డంతో ఉపాధ్యాయులకు గిఫ్ట్ కొనడానికి స్కూలుకు సమీపంలో ఉన్న ఓ దుకాణానికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి స్కూల్‌కి వస్తుండగా ద్విచక్ర వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి రమ్య కుడి చేతికి ఇంజక్షన్ సూదితో గుచ్చి పారిపోయాడు.

దీంతో నొప్పి అనిపించి బాలిక వెనక్కి తిరిగి చూడగా నల్లరంగు ప్యాంట్, ఆకుపచ్చ రంగు షర్ట్ వేసుకున్న సైకో అక్కడి నుంచి ఉడాయించాడు. విషయం టీచర్లకు తెలియడంతో ఆమెను చికిత్స కోసం స్థానిక ఎల్‌కే ఆస్పత్రికి తరలించారు. బాలికకు ఎలాంటి ప్రాణహాని లేదని  వైద్యులు స్పష్టం చేశారు. తల్లి లావణ్య ఫిర్యాదు మేరకు మల్కాజ్‌గిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా,    ఘటనా స్థలాన్ని, పాఠశాలల్లోని సీసీ ఫుటేజీలను మల్కాజిగిరి ఇన్‌స్పెక్టర్ శేఖర్‌గౌడ్ పరిశీలించారు. ఫుటేజీల్లో ఎలాంటి దృశ్యాలు నమోదు కాలేదని, విద్యార్థిని విచారించగా పొంతన లేని సమాధానం చెబుతోందని తెలిపారు. బాలిక చేతికి గుచ్చింది ఇంజక్షన్ నీడిలా? లేక గుండు పిన్నా ? అనేది నిర్ధారించాల్సి ఉందన్నారు.

మరిన్ని వార్తలు