లాభాల్లో మారుతీ రయ్..రయ్..

26 Jul, 2016 15:27 IST|Sakshi
లాభాల్లో మారుతీ రయ్..రయ్..

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ విశ్లేషకులు అంచనాలను అధిగమించింది. 2016-17 ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన తొలి త్రైమాసిక ఫలితాల్లో నికర లాభాలు 23 శాతం జంప్ అయి, రూ.1,486.2 కోట్లగా నమోదుచేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ లాభాలు రూ.1,208.1 కోట్లగా ఉన్నాయి. రెవెన్యూలు 11.6 శాతం ఎగిసి, రూ.14,655 కోట్లగా రికార్డు చేసింది.
 
అయితే రూ.15,133 కోట్ల అమ్మకాలతో కేవలం రూ.1,197 కోట్లను మాత్రమే మారుతీ సుజుకీ నికర లాభాలు నమోదవుతాయని ఎన్డీటీవీ నిర్వహించిన మార్కెట్ విశ్లేషకుల పోల్ లో తేలింది. ఈ అంచనాలను అధిగమించి, మారుతీ సుజుకీ తన లాభాల్లో దూసుకెళ్లింది.  కంపెనీ సంపాదించిన ఇతరత్రా ఆదాయాలు లాభాలు పెరగడానికి దోహదంచేశాయని కంపెనీ పేర్కొంది.

టర్నోవర్ ఎక్కువగా ఉండటం, ముడి సరుకుల వ్యయాల తగ్గుదల, నాన్-ఆపరేటింగ్ ఆదాయాలు పెరగటం,తక్కువ తరుగుదల ఇవన్నీ జూన్ త్రైమాసికంలో లాభాలు పెరగడానికి దోహదం చేశాయని కంపెనీ తన ఫైలింగ్లో తెలిపింది. జూన్ త్రైమాసికంలో ఇతరాత్ర ఆదాయలు 134 శాతం పెరిగి, రూ.483 కోట్లగా నమోదయ్యాయి.

అయితే రెవెన్యూ ముందస్తు అంచనాలను మారుతీ మిస్ చేసింది. వాల్యుమ్ గ్రోత్ తక్కువగా ఉండటంతో రెవెన్యూ అంచనాలను కంపెనీ మిస్ అయినట్టు మారుతీ పేర్కొంది. మనేసర్లోని సుబ్రోస్ లిమిటెడ్ ప్లాంట్లో నెలకొన్న ప్రమాద కారణంగా ఆ ప్లాంట్ను తాత్కాలికంగా మూసివేయడంతో, కంపెనీ 10 వేల యూనిట్ల ఉత్పత్తిని కోల్పోయిందని వెల్లడించింది. దీంతో వాల్యుమ్ గ్రోత్ పడిపోయిందని నివేదించింది.

జూన్ క్వార్టర్లో కంపెనీ 3.84 లక్షల వాహనాలను విక్రయించినట్టు మారుతీ పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ అమ్మకాలు 3.41 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. ఏడాది బేసిక్గా ఎగుమతులు 27 శాతం పడిపోయినా.. దేశీయ అమ్మకాలు 5.4 శాతం పెరిగినట్టు తన ఫలితాల్లో మారుతీ నివేదించింది.

మరిన్ని వార్తలు