`ఒత్తిడితో4,400మంది ఐఐటీ, ఎన్ఐటీయన్లు వెనక్కి

5 Aug, 2015 19:06 IST|Sakshi
ఒత్తిడితో4,400మంది ఐఐటీ, ఎన్ఐటీయన్లు వెనక్కి

న్యూఢిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఎన్ఐటీ(నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ) విద్యాసంస్థలకు కూడా డ్రాపవుట్లు తప్పడం లేదు. గడిచిన మూడేళ్లలో ఈ రెండు ఇన్స్టిట్యూట్ల నుంచి దాదాపు 4,400మంది విద్యార్థులు చదువు పూర్తి చేయకుండానే తిరుగుబాట పట్టారని కేంద్ర మానవ వనరుల శాఖ తెలిపింది. బుధవారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ మేరకు వివరణ ఇచ్చారు. 2012-13 నుంచి 2014-15 మధ్యకాలంలో ఐఐటీ కాలేజీల నుంచి 2,060 మంది, ఎన్ఐటీల నుంచి 2,352 మంది విద్యార్థులు మధ్యలో చదువు ఆపేశారని ఆమె వెల్లడించారు.

అయితే వీరిలో విద్యాసంస్థల్లో ఒత్తిడి భరించలేక కొందరు, ఉద్యోగాలు వచ్చి కొందరు, అనారోగ్యంతో మరికొందరు, వ్యక్తిగత కారణాలతో ఇంకొందరు కోర్సును మధ్యలో వదిలేసి వెళుతున్నట్లుగా తెలిపారు. అయితే, అకాడమిక్ ఒత్తిడి కారణంగానే ఎక్కువ మంది విద్యార్థులు వెనక్కి వెళుతున్నట్లు తెలిసింది. రూర్కీ ఐఐటీ నుంచి ఎక్కువగా (228) డ్రాపవుట్లు నమోదు కాగా, ఖరగ్ పూర్ (209)తో తరువాతి స్థానంలో ఉంది. ఇక డ్రాపవుట్లే లేని ఐఐటీలుగా మండి, జోధ్పూర్, మద్రాస్, రోపర్ నిలిచాయి. దేశంలో మొత్తం 16 ఐఐటీ కాలేజీలు, 30 ఎన్ఐటీలు ఉన్నాయి.  ఇదిలా ఉండగా, ఇక ప్రతి విద్యాసంస్థలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి విద్యార్థుల భావోద్వేగాలు గుర్తించి కౌన్సెలింగ్ ఇప్పించడం ద్వారా డ్రాపవుట్ సమస్యను అధిగమిస్తామని స్మృతి ఇరానీ తెలిపారు.

మరిన్ని వార్తలు