గడువు ముగిసినా జియోనే వాడతాం!

6 Jan, 2017 16:30 IST|Sakshi
గడువు ముగిసినా జియోనే వాడతాం!
ఉచిత ఆఫర్లతో వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్న ముఖేష్ అంబానీ రిలయన్స్ జియోకు, ఆ ఆఫర్ల గడువు ముగిసిన తర్వాత కూడా వినియోగదారులుంటారట. ఏప్రిల్ 1 నుంచి రిలయన్స్ జియో డేటా సర్వీసులపై ఛార్జ్ చేసినా భరించేందుకే తాము సిద్ధమేనని అంటున్నారు. దాదాపు 85 శాతం కస్టమర్లు ఫ్రీ ఆఫర్ గడువు ముగిసినప్పటికీ జియో వాడేందుకే సిద్ధమని పేర్కొంటున్నారు. బ్యాంకు ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అయితే వారిలో 67 శాతం మంది జియోను రెండో సిమ్గానే వాడతారని తేలింది. అదేవిధంగా 18 శాతం మొదటి సిమ్గా దీన్ని ఉపయోగిస్తారని సర్వే పేర్కొంది.  అయితే అత్యంత సంతృప్తికరమైన కస్టమర్లు 97.7 శాతం మంది టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్కే ఉన్నారని సర్వే తెలిపింది.
 
కేవలం 17 శాతం భారతీ ఎయిర్టెల్ కస్టమర్లే జియోపై ఆసక్తి చూపుతున్నారని, అది కూడా క్వాలిటీ బాగుంటేనే దీన్ని మొదటిసిమ్గా వాడతామని చెబుతున్నట్టు తెలిసింది. రిలయన్స్ కమ్యూనికేషన్ లాంటి చిన్న టెల్కోలు పరిస్థితి అద్వానంగా ఉందని, జియోకు మరలిన ఈ కస్టమర్లు వాటిని సెకండరీ సిమ్గా వాడేందుకే మొగ్గుచూపుతున్నారని బ్యాంకు అమెరికా మెర్రిల్ లించ్ సర్వే పేర్కొంది. ఆశ్కర్యకరంగా 26 శాతం యూజర్లు జియోను మొదటి సిమ్గానే వాడుతున్నారు. ఇన్నిరోజులు జియో నెట్ స్పీడ్పై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఇతర టెల్కోలతో పోలిస్తే దీనికే 55 శాతం స్పీడ్ అధికమని తేలింది. జియో స్పీడ్ వేగంగా ఉన్నప్పటికీ, అస్థిరంగా ఉందని తేలింది. కేవలం 44 శాతం మందే జియో స్పీడ్ తక్కువగా ఉందని అభిప్రాయ పడ్డారు.  
 
మరిన్ని వార్తలు