సోషల్ మీడియాలో తమ జట్టును కడిగిపారేస్తున్న నెటిజన్లు
చాంపియన్స్ ట్రోఫీలో ఎంతో ఆసక్తి రేపిన దాయాదాల పోరు ముగిసినా.. ఆ మ్యాచ్ తాలుకు ప్రకంపనలు ఇంకా రేగుతూనే ఉన్నాయి. బద్ధ విరోధి అయిన పాకిస్థాన్ జట్టుపై 124 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియాపై మనదేశంలో ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. అదే సమయంలో అన్ని విభాగాల్లో విఫలమై.. చిత్తుగా ఓడిన పాకిస్థాన్ జట్టుపై వారి దేశంలో తీవ్ర ఆగ్రహం పెల్లుబుక్కుతోంది. సోషల్ మీడియా వేదికగా పాక్ నెటిజన్లు తమ జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. భారత్ చేతిలో ఇంత దారుణంగా ఓడిపోతారా అంటూ పాక్ క్రికెటర్లను ఉతికి ఆరేస్తున్నారు. తమ క్రికెటర్లను కించపరుస్తూ మెమెలు, ఫొటోలు, ట్వీట్లు, పోస్టులు పెట్టి తమ నిరసనను చాటుతున్నారు.
ఇక ఫాస్ట్ బౌలర్ వహబ్ రియాజ్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. అతన్ని పాక్ నెటిజన్లు చీల్చి చెండాడుతున్నారు. ప్రధానంగా అతన్నే టార్గెట్ చేసుకుని ఎక్కువగా విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పాక్ ప్రధాన ఫాస్ట్ బౌలర్ అయిన రియాజ్ భారత్ మ్యాచ్లో ఘోరంగా విఫలమయ్యాడు. అతను 8.4 ఓవర్లు వేసి 87 పరుగులు సమర్పించుకున్నాడు. అతని బౌలింగ్ను జీర్ణించుకోలేకపోతున్న పాక్ నెటిజన్లు అతన్ని తీవ్రంగా దూషిస్తూ ఎండగడుతున్నారు. పాక్ నెటిజన్లు తమ క్రికెటర్లను ఎంత దారుణంగా దూషిస్తున్నారో పాక్ చానెల్ ఒకటి వెల్లడించింది. పాక్ నెటిజన్ల ఆగ్రహాన్ని, పోస్టులను ఒకచోట గూడిగుచ్చి ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ఈ కథనం ఇప్పుడు వైరల్గా మారింది.