పాక్ గూఢచర్య రాకెట్ బట్టబయలు

30 Nov, 2015 04:34 IST|Sakshi

జమ్మూలో బీఎస్‌ఎఫ్ జవాను, ఐఎస్‌ఐ ఏజెంటు అరెస్టు
న్యూఢిల్లీ: భారత్‌లో గూఢచర్యానికి ఐఎస్‌ఐ చేస్తున్న ప్రయత్నాన్ని రెండు వేరువేరు చోట్ల ఢిల్లీ, కోల్‌కతా పోలీసులు భగ్నం చేశారు. భారత సైనిక రహస్యాలను పాక్‌కు చేరవేసే రాకెట్‌లో ఇద్దరిని ఢిల్లీ పోలీసులు జమ్మూ రైల్వే స్టేషన్లో అరెస్టు చేశారు. కొంతకాలంగా కశ్మీర్ పోలీసులు, బీఎస్‌ఎఫ్‌లో కొందరు సైనిక రహస్యాలను పాక్‌కు చేరవేస్తున్నారని భారత నిఘా హెచ్చరిస్తున్నాయి. దీంతో కొందరు అనుమానితుల వివరాలు సేకరించిన ఢిల్లీ పోలీసులు తమ ప్రయత్నాల్లో ఉన్నారు.

బీఎస్‌ఎఫ్ నిఘా విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అబ్దుల్ రషీద్.. సైనిక రహస్యాలను కఫియతుల్లా ఖాన్ అలియాస్ మాస్టర్ రాజా(44) అనే ఐఎస్‌ఐ ఏజెంటుకు అందిస్తుండగా జమ్మూ రైల్వే స్టేషన్లో పోలీసులు పట్టుకున్నారు. వీరినుంచి ఆర్మీకి సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, కోల్‌కతాలోనూ ముగ్గురు ఐఎస్‌ఐ ఏజెంట్లను స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

కోల్‌కతా శివారు ప్రాంతమైన ఇక్బాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇర్షాద్ అన్సారీ (51), ఆయన కుమారుడు అసఫ్ అన్సారీ (23)తోపాటు వీరి బంధువు జహంగీర్‌ను కూడా ఎస్‌టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇర్షాద్, జహంగీర్ కొంతకాలంగా కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్‌లో నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు.

వీరినుంచి ఐదు లక్షల నకిలీ కరెన్సీతోపాటు సుభాష్ చంద్రబోస్ డాక్‌యార్డ్ చిత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్‌లో ఉన్న బంధువులను తరచూ కలిసేందుకు వెళ్తున్న తరుణంలో అక్కడ ఐఎస్‌ఐతో పరిచయమైందని.. అక్కడ శిక్షణ పొందినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

మరిన్ని వార్తలు