ఏప్రిల్ 21న పాలీసెట్-2016

6 Mar, 2016 03:23 IST|Sakshi

ఈ నెల 8న నోటిఫికేషన్ విడుదల: సాంకేతిక విద్యా డెరైక్టర్ ఎంవీరెడ్డి
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశంకోసం నిర్వహించే పాలీసెట్-2016 ఏప్రిల్ 21న జరగనుందని సాంకేతిక విద్యా డెరైక్టర్ ఎంవీ రెడ్డి శనివారం ప్రకటించారు. పాలీసెట్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 8న విడుదల చేస్తామని, టెన్త్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గతంలో ఉన్న రూ.330 దరఖాస్తు ఫీజును ఈ ఏడాది రూ.165కు తగ్గించామన్నా రు. polycetts.nic.in వెబ్‌సైట్ ద్వారా సమీప పాలిటెక్నిక్ సహాయ కేంద్రాలు లేదా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల నుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
 
21 నుంచి పరీక్షలు: పాలిటెక్నిక్ వార్షిక పరీక్షలు మార్చి 21నుంచి ప్రారంభం కానున్నాయని ఎంవీరెడ్డి తెలిపారు. ఈ సారి పరీక్షల నిర్వహణలో పలు సంస్కరణలు తెచ్చామని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వెసులుబాటు కల్పిస్తూ ఫస్టియర్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని సరళీకరించామన్నారు. దీనిద్వారా విద్యార్థులు జవాబులను వ్యాసరూపంలో కాకుండా సంక్షిప్త రూపంలో రాసేందుకు సలువవుతుందన్నారు.పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను అరికట్టడంకోసం ఈ ఏడాది నుంచి జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ప్రైవేటు పాలిటెక్నిక్‌లలోని పరీక్షహాళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించామన్నారు. పాలిటెక్నిక్ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాక ఒకటి లేదా 2 సబ్జెక్టుల్లో మాత్రమే ఫెయిలైన విద్యార్థులకు మొదటిసారిగా ఇన్‌స్టంట్ పరీక్షలను నిర్వహించబోతున్నట్లు ఎంవీరెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు