ఎన్జీటీ పిటిషనర్ పండలనేని శ్రీమన్నారాయణ
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే.. కేసులు పెట్టి వేధిస్తున్నారని సామాజికవేత్త పండలనేని శ్రీమన్నారాయణ ఆరోపించారు. తనకు ఏం జరిగినా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుదే బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. అరెస్ట్లకు భయపడేది లేదని, అవసరమైతే జైల్లోనే ఉండి న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఏపీ రాజధాని భూముల విషయంలో 70 శాతం మంది ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని, వాళ్లందరిపైనా ప్రభుత్వం కేసులు పెడుతుందా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై కోర్టుకు వెళ్లే అధికారం తమకు ఉందని, దీనిపై ప్రభుత్వం ఎన్నికేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామని శ్రీమన్నారాయణ స్పష్టం చేశారు.